ముందుమాట
“నాకథలు చదివినవాళ్లు నన్ను ప్రేమకథలు రాయమని అడగరు” అన్నాను ఇంతకుముందు. కాని నిజానికి నాకథలు చదివింతరవాతే, వైదేహి (తెలుగుజ్యోతి, న్యూజెర్సీ) నన్ను పిలిచి, సర్వధారి ఉగాది ప్రత్యేకసంచికకి కథ రాసి ఇవ్వమని అడిగారు. నేను పైమాటే చెప్పాను. ఆవిడ “పోనీండి, ప్రేమ లేకపోవడంమీదే రాయండి” అన్నారు. ఆతరవాత, ప్రేమ చాలారకాలు కదా అని జోడించారు.
అప్పుడనిపించింది నాచిన్నతనంలో నాకు కథలు చెప్పిన ఈ కథలఅత్తయ్యగారికథ ఇంతవరకూ ఎవరికీ చెప్పనేలేదని. ఆవిడా, ఆవిడ చెప్పిన చిలకలకొలికి కథా నామనస్సులో చిరస్థాయిగా వున్నాయి ఈనాటికీను.. దానికి అక్షరరూపం ఇవ్వడానికి కారణమయిన వైదేహీ శశిధర్కీ, తెలుగుజ్యోతి, న్యూజెర్సీ, వారికీ కృతజ్ఞతలతో ఇక్కడ మళ్లీ పెడుతున్నాను.
ఇది తెలుగుజ్యోతి ఉగాది సంచిక 2008, లో తొలిసారి ప్రచురింపబడింది.
కథల అత్తయ్యగారు
000
“ఎవరూ .. అమ్మాయీ …”
“ నేనేనండీ అత్తయ్యగారూ.”
“దా కూచో, ఇప్పడే అనుకుంటున్నా, ఇంకా రాలేదేమా అని.”
“ఈరోజు స్కూల్లో కొంచెం ఆలస్యంవయిందండీ. సత్యంమాస్టారు అన్ని లెక్కలు పూర్తి చేసి వెళ్లమన్నారు.”
“కూచో. ఇవాళ ఏంకూర చెయ్యనా అని చూస్తున్నా,” అంటూ అత్తయ్యగారు మూలనున్న పీట నాముందుకి తోసారు.. అత్తయ్యగారు మడి కట్టుకు వంట చేస్తారు, నేను పొరపాటున తగుల్తానేమోనని ఆమె అనుకుంటారని నాకు తెలుసు. అంచేత పీట గోడవారకి జరుపుకుని ఒదిగి కూచున్నా.
“అరిటికాయ వేపుడు చెయ్యండి. మామయ్యగారికిష్టం కదా” అన్నా.
“అల్లం పచ్చిమిరపకాయా నూరి పెడతా. అల్లం పేగు శుద్ధి చేస్తుంది” అన్నారు అత్తయ్యగారు, కూరలబుట్టలోంచి రెండు అరిటికాయలూ, కత్తిపీటా ముందేసుకుని కూర్చుంటూ.
నేను చూస్తూ కూచున్నాను. ”కథ చెప్పండి అత్తయ్యగారూ” అన్నాను కొంచెంసేపు ఆగి.
“ఏంకథ చెప్పను?”
“చిలకలకొలికి చిన్నదానా కథ పూర్తి చెయ్యలేదు కదండీ నిన్న.”
“ఎంతవరకూ చెప్పానూ. …” అన్నారు అలవాటుగా దీర్ఘాలు తీస్తూ.
“అదేనండి, పెద్దరాణికి ఒకమ్మాయి పుట్టింది. కాని చిన్నరాణికి అది ఇష్టంలేదు. అంచేత ఆపాపని పుట్టినవెంటనే దాసీదానికి ఇచ్చి, పారేయమని చెప్పింది. తరవాత, పెద్దరాణితో ‘నీకు కప్పపిల్ల పుట్టింది’ అని చెప్పింది. పెద్దరాణి ‘అయ్యో ఇది నాకర్మ’ అనుకుని ఏడుస్తూ వూరుకుందిట. తరవాత చిన్నరాణికి కూడా ఒక అమ్మాయి పుట్టింది. ఇలా కొంతకాలం సాగింది. పెద్దరాణికూతురు దాసీదానింటిలోనూ, చిన్నరాణికూతురు రాజుగారింటిలోనూ పెరుగుతున్నారు. చిన్నరాణి పెద్దమ్మాయిచేత దాసీపనులు చేయిస్తూ, చాలా కష్టాలు పెడుతూ వుంటుందిట. చిన్నమ్మాయికేమో, అదే ఆవిడ సొంతకూతురికి అది అస్సలు బాగుండదు..”
అత్తయ్యగారు “నీకు బాగా గుర్తుంటుంది,” అంటూ నవ్వి, కూర తాలింపుకోసం పొయ్యిమీద బాణలి పెట్టి, రెండు గరిటెలు నూనె పోసి, నూనె బాగా కాగినాక ఆవాలూ, మిరపకాయలూ వేశారు. మిరపకాయలఘాటు గదంతా గుప్పుమని కమ్ముకుంది. ఆఘాటుకి నేను ఉక్కిరిబిక్కిరయిపోయాను. దగ్గొచ్చేసింది ఒక్కుమ్మడిగా.
“పొమ్మనలేక పొగబెట్టినట్లు” అన్నారు అత్తయ్యగారు నవ్వుతూ.
నేను ఆమెవంక చూస్తూ కూర్చున్నాను. “అఁటే ఏమిటి” అని అడగాలనుంది కానీ అడగలేదు, చిలకలకొలికి కథ ఆగిపోతుందని. ఆపొగకథ రేపు అడుగుతాను.
అత్తయ్యగారిని చూస్తుంటే ఎంతో బావుంటుంది నాకు. పొట్టిగా, కాస్త లావుగా, కళకళల్లాడుతూ చందమామలాటి పచ్చనిముఖంమీద చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తారు ఆమె. అట్టే నగలేమీ పెట్టుకోకపోయినా ఏమీ తక్కువయినట్టు కనిపించరు. అందుకే రోజూ వాళ్లింటికి వెళ్లటం నాకిష్టం.
“అఁ అప్పుడూ … అచిన్నమ్మాయికి చానా కష్టం అయింది గదా.”
“అవును పాపం. మరి ఆఅమ్మాయి వాళ్లమ్మకి చెప్పలేదా ఇదేం బాగులేదని?”
“వాళ్లమ్మంటే అఅమ్మాయికి భయం. అట్టా చెప్పితే, ఆమెకి కోపం వచ్చి కొడుతుందేమోనని చెప్పలేదు. ఆతరవాత ఒక ఉపాయం ఆలోచించింది”
నేను నిటారుగా కూచున్నాను ఊపిరి బిగబట్టి. .
“ఒకరోజు, ఆచిన్నమ్మాయి బొమ్మలతో అమ్మాట ఆడుకుంటోందిట, ఎంచక్కా అమ్మమాదిరి తను కూడా మడి కట్టుకుని, వంట చేసి, ఆబొమ్మకి తిను, తిను అంటూ తినబెట్టిందిట. కాని ఆబొమ్మేమో తినలేదు. అప్పుడు ఆఅమ్మాయేమో నాబొమ్మ బువ్వ తినటంలేదూ అంటూ ఏడవటం మొదలెట్టిందిట.
వాళ్లమ్మ అది చూసి, ‘చిలకలకొలికీ, చినదానా, బొమ్మలు బువ్వలు తిందురటే’ అందిట నవ్వుతూ.
అప్పుడేమో ఆఅమ్మాయి, ‘మాయలదానా, మహిమలదానా, మనుషులు కప్పల కందురటే’ అందిట చమత్కారంగా.
అప్పుడు చిన్నరాణి తను చేసిన తప్పు తెలుసుకుని, పెద్దరాణీకి నిజం చెప్పి, పెద్దమ్మాయిని పిలుచుకొని వచ్చి, ప్రేమగా చూసుకోసాగిందిట.” అంటూ ముగించేరు అత్తయ్యగారు.
నామనసు కుదుటపడింది. హమ్మయ్య. మంచిఅమ్మాయికి కష్టాలు పోయేయి. చిన్నమ్మాయి తనతెలివితేటలతో తనతల్లి పాడుబుద్ధిని మార్చేసి, మంచిదాన్ని చేసేసింది. కొంచెంసేపు నేనేమీ మాటలాడలేదు. తరవాత నెమ్మదిగా అడిగా, “పొగ పెట్టటం ఏమిటిండీ అత్తయ్యగారూ,” అని, ఇందాకటిమాట గుర్తొచ్చి.
“చీకటి పడుతోంది. మీఅమ్మగారు ఎదురుచూస్తూంటారు. రేపు చెపుతాలే.” అని నన్ను ఇంటికి పంపేశారు ఆరోజుకి.
000
అప్పుట్లో మేం గుంటూరుదగ్గర మంగళగిరిలో వుంటూ వుండేవాళ్లం. ఇది నాకు బాగా గుర్తుండిపోయిన, అలనాటి తొలికథ, ఇంకా మర్రిచెట్టు తొర్రలో ప్రాణాలు దాచుకున్న రాక్షసులూ, ఏడుమల్లెపూవులఎత్తు రాకుమార్తెల కథలూ రోజూ చెప్పిన అ అత్తయ్యగారిపేరు రామడుగు లలితాంబగారు. మామయ్యగారిపేరు నరసింహంగారు. వారింటి తలుపులు సదా నాకోసం తెరిచివుండేవి. అత్తయ్యగారు నాకోసం ఎదురుచూస్తూ వుండేవారు రోజూ.
నిజంగా ఆవిడకీ మాకూ ఏచుట్టరికమూ లేదు కాని ఆరోజులు అలాటివి. పెద్దలని వరసపెట్టి పిలవడం, లేని చుట్టరికాలు కలుపుకుని ఆప్యాయతలు పెంచుకోడం సర్వసాధారణం. అంటే మాఅత్తయ్యగారు కూడా అందరితో పాటే అనికాదు. ఆవిడకి ఆవిడే సాటి నామటుకు నాకు మరో అత్తయ్యగారు లేరు.
మానాన్నగారిఉద్యోగరీత్యా మేం కొత్తగా మంగళగిరిలో స్థిరపడినరోజులు అవి. నేను చింతకింది కనకయ్యగారి హైస్కూలులో ఫస్టుఫారంలో చేరాను. స్కూలినించి నడిచి ఇంటికి వస్తుంటే, దారిలో, మాయింటికి మలుపు తిరిగేముందువీధిలో రెండిళ్లకి ఇవతల అత్తయ్యగారిల్లు వస్తుంది. అరుగుమీద మామయ్యగారు వాలుకుర్చీలో కూర్చుని, పేపరు చదువుకుంటుంటే, అత్తయ్యగారు స్థంభానికానుకుని కూర్చుని, అప్పుడే కోసిన కనకాంబరాలూ, మరువం, మల్లెలూ మాల కడుతూ, ఏ ఊర్మిళాదేవి నిద్రో పాట పాడుకుంటూ కనిపించేవారు. మాయింట్లో మాఅమ్మవేపూ, నాన్నగారివేపూ కూడా పెద్దలు అప్పటికే తరించిపోయారు. పైగా అటూ ఇటూ కూడా మా అమ్మా, నాన్నగారే తొలిసంతానం. అంచేత నాకు అందరు పిల్లల్లా చెప్పుకోడానికి అమ్మమ్మలూ, తాతగార్లూ, లేరేమో, ఈదంపతులని చూస్తుంటే ఏదో చెప్పలేని తమకం తగిలేది మనసులో నాకు.
నేను వారినిద్దరినీ పరీక్షగా చూస్తున్నానని నాకు తెలీలేదు ఆమె ఒకరోజు తలెత్తి నావేపు చూసి నవ్వేవరకూ. నేను సిగ్గుపడి పరుగెత్తుకుంటూ ఇంటికొచ్చేసేను. మరునాడు ఆమె దా అంటూ పిలిచారు. నేను జంకుతూనే దగ్గరికి వెళ్లాను.
నేను బాగా దగ్గరగా వచ్చినతరవాత, ఆమె చిరునవ్వుతో, నారెండుబుజాలు పట్టుకుని, నన్ను వెనక్కి తిప్పి, నాజడలో చిన్నపాయ తీసి, చేతిలో వున్న కదంబమాల ముడిచి తురిమారు. మళ్లీ తనవేపు తిప్పుకుని, “నీపేరేమిటి?” అని అడిగారు.
“మాలతి అండీ,” అన్నాను నెమ్మదిగా.
“ఎంచక్కా వున్నావు బాలాత్రిపురసుందరిలా,” అన్నారామె.
నాకు చెప్పలేనంత సిగ్గూ, సంతోషమూ ముంచుకొచ్చేయి. నేను మాటాడకుండా ఒక్క వురుకున ఇంటికి చేరుకున్నా.
“ఆపువ్వులెక్కడివి?” అంది అమ్మ.
“పక్కవీధిలో వుండే అత్తయ్యగారు పెట్టేరు,” అన్నాను.
అమ్మ తిడుతుందేమో అనుకున్నాను కానీ, తేలిగ్గానే పోనిచ్చేసింది, “తిన్నగా ఇంటికి రాకుండా ఆపెత్తనాలేమిటి” అనేసి, తనపనిలో పడిపోయింది.
వరసగా నాలుగురోజులు ఇలా జరిగింది. అయిదో రోజు, అత్తయ్యగారు, నాతలలో పువ్వులు పెట్టబోతూ, “ఇదేం జడ ఒగ్గులొగ్గులుగా” అన్నారు.
“మాఅమ్మ బయటుందండీ. అంచేత నేనే వేసుకున్నా,” అన్నాను.
“ఇంటికెళ్లి, మీఅమ్మతో చెప్పిరా. కుదుమట్టసంగా దువ్వి మళ్లా జడ వేసి చెండు తురుముతా,” అన్నారామె.
నేను సరేనండీ అని పరుగెత్తుకుంటూ వెళ్లి అమ్మకి చెప్పాను.
“ఆవిడకి మరేం పనిలేదూ నీకు జడలేస్తూ కూచోడానికి. ఇప్పుడేం వద్దు,” అంది అమ్మ.
“అత్తయ్యగారే వేస్తానన్నారు,,” అన్నాను నేను రొకాయిస్తూ.
“ఆవిడేదో మర్యాదకి అనివుంటారు. వద్దని చెప్తున్నానా,” అంటూ కసురుకుంది అమ్మ.
నేను గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ పెరట్లోకి వెళ్లిపోయాను. నాకు కోపం వస్తే పెరట్లో జామచెట్టెక్కి కూచుంటా. అమ్మ మంచికళనుంటే, వచ్చి, మంచిమాటలాడి లోపలికి తీసుకెళ్తుంది. లేకపోతే, అదే వస్తుంది అని వూరుకుంటుంది. ఇప్పుడు తను కూడా ఇంట్లోకి వెళ్లదు కనక, రెండోవరసే జరిగింది. నేను రెండు జామకాయలు తిని ఇంట్లోకి వచ్చేసాను మంచినీళ్లకోసం.
మర్నాడు స్కూలినుండి వస్తుంటే, అత్తయ్యగారు చూసి, నన్ను ఆపి, ఆడిగారు, నిన్న రాలేదేం అని.
“ఆవిడకి మరేం పనిలేదూ నీకు జడలేస్తూ కూచోడానికి అందండీ మా అమ్మ,” అని చెప్పాను, నాదేం తప్పులేదని చెప్పడానికి.
అత్తయ్యగారు నవ్వి, “ఫరవాలేదు, అత్తయ్యగారే వేస్తానన్నారూ, మీ అమ్మ స్నానం అయేవరకూ, రోజూ ఉదయమే రా, జడ వేస్తాను అని అత్తయ్యగారు చెప్పారని మీఅమ్మకి చెప్పు” అన్నారు.
నేను సంతోషంగా ఇంటికి వెళ్లి, మాఅమ్మతో “ఫరవాలేదు, అత్తయ్యగారే వేస్తానన్నారూ, మీ అమ్మ స్నానం అయేవరకూ, రోజూ ఉదయమే రా, జడ వేస్తాను అని అత్తయ్యగారు చెప్పారని మీఅమ్మకి చెప్పు” అని చెప్పమంది అని చెప్పాను. అలా మొదలయింది మా అనుబంధం. అసలు చాలారోజులవరకూ మాఅమ్మా అత్తయ్యగారూ కలుసుకోనేలేదు. నేనే అత్తయ్యగారిలా చెప్పమన్నారని అమ్మతోనూ, అమ్మ ఇలా అందని అత్తయ్యగారితోనూ రాయబారాలు నడుపుతూ వచ్చేను. ఆరోజుల్లోనే అత్తయ్యగారు నాకు శ్రీకృష్ణరాయబారం కథ చెప్పారు జడవేస్తూ.
అలా నాకు జడ వేస్తూ కథలు చెప్పడం మొదలయింది. తరవాత, సాయంకాలాలు, స్కూలినించి ఇంటికొచ్చి, కాఫీ తాగి, “అత్తయ్యగారింటికెళ్తున్నా” అని అమ్మకి చెప్పి వాళ్లింటికి వెళ్లేదాన్ని.
అమ్మ “రోజూ ఎందుకు . ఆవిడ పనులు అవిడని చేసుకోనీకుండా కాళ్లకడ్డంపడుతూ,” అంది ఓరోజు.
అత్తయ్యగారే రమ్మన్నారని నేను పట్టుబట్టి వెళ్లాను. రోజూ ఎందుకు? అవిడని పని చేసుకోనీకుండా కాళ్లకడ్డంపడుతూ అంటోందండీ మాఅమ్మఅని కూడా చెప్పాను అత్తయ్యగారికి.
“నువ్వు నాకాళ్లకడ్డం పట్టంలేదని చెప్పు మీఅమ్మగారికి,” అన్నారు అత్తయ్యగారు ఎప్పటిలాగే నవ్వుతూ.
నేను మళ్లీ ఆమాట మోసుకొచ్చి మాఅమ్మకి చేరేసేను. మాఅమ్మ కూడా నవ్వుతూ, “ఆవిడకి ఆడపిల్లల్లేని ముచ్చట తీరిపోతున్నట్టుంది,” అంది.
అత్తయ్యగారికి ఒక కొడుకు. ఆఅబ్బాయి బెంగుళూరులో చదువుకుంటూ వుండేవాడు. అంచేత వాళ్లింట్లో నేను వాళ్ల అమ్మాయిలాగే మసలుతూంటేదాన్ని.
నాజీవితంలో నాకు తారసపడిన ఎంతోమందిని మరిచిపోయాను..ఎన్నో సంఘటనలు మర్చిపోయాను. ఉపాయాలతో, వాదనలతో బుద్ధులు మార్చేయగలమని నమ్మేరోజులు పోయేయి. నిజజీవితంలో నాఅనుభవంలో ఎవరూ “సరేనండీ, మీరు చెప్పారుకనక మారిపోతాను” అంటూ మంచివాళ్లయిపోయినవాళ్లు నాకు తటస్థపడలేదు. నేను రాసే కథలన్నీ సుఖాంతాలు కావు. కానీ, ఇప్పటికీ కథల్లో మంచివాళ్లబాధలు తొలిగిపోతేనూ, దుష్టులు శిష్టులు అయిపోతేనూ అదోరకం మనశ్శాంతి.
ఆరుదశాబ్దాల పూర్వం ప్రతిరోజూ, స్కూలయింతరవాత చల్లని సాయంకాలాలు, నాయీడు పిల్లలందరూ వీధుల్లో ఆడుకుంటుంటే, అత్తయ్యగారి వంటింటిలో కూర్చుని నేను విన్నకథలూ, ఆకథలు చెప్తూ నన్ను అలరించిన అత్తయ్యగారూ పదిలంగా సుస్థిరంగా నామనోఫలకంపై నిలిచివున్నారు ఈనాటికీను, జననాంతర సౌహృదాని అంటే ఇలాటివే అనిపిస్తుంది నాకు.
000
(జనవరి 200
నాకథలు, సాహిత్యం లో రాసారు | అఁటిఁచబడ్డవి కథలు, సాహిత్యం | 4 వ్యాఖ్యానాలు »