Feed on
టపాలు
వ్యాఖ్యలు

కథలఅత్తయ్యగారు

ముందుమాట
“నాకథలు చదివినవాళ్లు నన్ను ప్రేమకథలు రాయమని అడగరు” అన్నాను ఇంతకుముందు. కాని నిజానికి నాకథలు చదివింతరవాతే, వైదేహి (తెలుగుజ్యోతి, న్యూజెర్సీ) నన్ను పిలిచి, సర్వధారి ఉగాది ప్రత్యేకసంచికకి కథ రాసి ఇవ్వమని అడిగారు. నేను పైమాటే చెప్పాను. ఆవిడ “పోనీండి, ప్రేమ లేకపోవడంమీదే రాయండి” అన్నారు. ఆతరవాత, ప్రేమ చాలారకాలు కదా అని జోడించారు.
అప్పుడనిపించింది నాచిన్నతనంలో నాకు కథలు చెప్పిన ఈ కథలఅత్తయ్యగారికథ ఇంతవరకూ ఎవరికీ చెప్పనేలేదని. ఆవిడా, ఆవిడ చెప్పిన చిలకలకొలికి కథా నామనస్సులో చిరస్థాయిగా వున్నాయి ఈనాటికీను.. దానికి అక్షరరూపం ఇవ్వడానికి కారణమయిన వైదేహీ శశిధర్‌కీ, తెలుగుజ్యోతి, న్యూజెర్సీ, వారికీ కృతజ్ఞతలతో ఇక్కడ మళ్లీ పెడుతున్నాను.
ఇది తెలుగుజ్యోతి ఉగాది సంచిక 2008, లో తొలిసారి ప్రచురింపబడింది.

కథల అత్తయ్యగారు

000

“ఎవరూ .. అమ్మాయీ …”
“ నేనేనండీ అత్తయ్యగారూ.”
“దా కూచో, ఇప్పడే అనుకుంటున్నా, ఇంకా రాలేదేమా అని.”
“ఈరోజు స్కూల్లో కొంచెం ఆలస్యంవయిందండీ. సత్యంమాస్టారు అన్ని లెక్కలు పూర్తి చేసి వెళ్లమన్నారు.”
“కూచో. ఇవాళ ఏంకూర చెయ్యనా అని చూస్తున్నా,” అంటూ అత్తయ్యగారు మూలనున్న పీట నాముందుకి తోసారు.. అత్తయ్యగారు మడి కట్టుకు వంట చేస్తారు, నేను పొరపాటున తగుల్తానేమోనని ఆమె అనుకుంటారని నాకు తెలుసు. అంచేత పీట గోడవారకి జరుపుకుని ఒదిగి కూచున్నా.
“అరిటికాయ వేపుడు చెయ్యండి. మామయ్యగారికిష్టం కదా” అన్నా.
“అల్లం పచ్చిమిరపకాయా నూరి పెడతా. అల్లం పేగు శుద్ధి చేస్తుంది” అన్నారు అత్తయ్యగారు, కూరలబుట్టలోంచి రెండు అరిటికాయలూ, కత్తిపీటా ముందేసుకుని కూర్చుంటూ.
నేను చూస్తూ కూచున్నాను. ”కథ చెప్పండి అత్తయ్యగారూ” అన్నాను కొంచెంసేపు ఆగి.
“ఏంకథ చెప్పను?”
“చిలకలకొలికి చిన్నదానా కథ పూర్తి చెయ్యలేదు కదండీ నిన్న.”
“ఎంతవరకూ చెప్పానూ. …” అన్నారు అలవాటుగా దీర్ఘాలు తీస్తూ.
“అదేనండి, పెద్దరాణికి ఒకమ్మాయి పుట్టింది. కాని చిన్నరాణికి అది ఇష్టంలేదు. అంచేత ఆపాపని పుట్టినవెంటనే దాసీదానికి ఇచ్చి, పారేయమని చెప్పింది. తరవాత, పెద్దరాణితో ‘నీకు కప్పపిల్ల పుట్టింది’ అని చెప్పింది. పెద్దరాణి ‘అయ్యో ఇది నాకర్మ’ అనుకుని ఏడుస్తూ వూరుకుందిట. తరవాత చిన్నరాణికి కూడా ఒక అమ్మాయి పుట్టింది. ఇలా కొంతకాలం సాగింది. పెద్దరాణికూతురు దాసీదానింటిలోనూ, చిన్నరాణికూతురు రాజుగారింటిలోనూ పెరుగుతున్నారు. చిన్నరాణి పెద్దమ్మాయిచేత దాసీపనులు చేయిస్తూ, చాలా కష్టాలు పెడుతూ వుంటుందిట. చిన్నమ్మాయికేమో, అదే ఆవిడ సొంతకూతురికి అది అస్సలు బాగుండదు..”
అత్తయ్యగారు “నీకు బాగా గుర్తుంటుంది,” అంటూ నవ్వి, కూర తాలింపుకోసం పొయ్యిమీద బాణలి పెట్టి, రెండు గరిటెలు నూనె పోసి, నూనె బాగా కాగినాక ఆవాలూ, మిరపకాయలూ వేశారు. మిరపకాయలఘాటు గదంతా గుప్పుమని కమ్ముకుంది. ఆఘాటుకి నేను ఉక్కిరిబిక్కిరయిపోయాను. దగ్గొచ్చేసింది ఒక్కుమ్మడిగా.
“పొమ్మనలేక పొగబెట్టినట్లు” అన్నారు అత్తయ్యగారు నవ్వుతూ.
నేను ఆమెవంక చూస్తూ కూర్చున్నాను. “అఁటే ఏమిటి” అని అడగాలనుంది కానీ అడగలేదు, చిలకలకొలికి కథ ఆగిపోతుందని. ఆపొగకథ రేపు అడుగుతాను.
అత్తయ్యగారిని చూస్తుంటే ఎంతో బావుంటుంది నాకు. పొట్టిగా, కాస్త లావుగా, కళకళల్లాడుతూ చందమామలాటి పచ్చనిముఖంమీద చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తారు ఆమె. అట్టే నగలేమీ పెట్టుకోకపోయినా ఏమీ తక్కువయినట్టు కనిపించరు. అందుకే రోజూ వాళ్లింటికి వెళ్లటం నాకిష్టం.
“అఁ అప్పుడూ … అచిన్నమ్మాయికి చానా కష్టం అయింది గదా.”
“అవును పాపం. మరి ఆఅమ్మాయి వాళ్లమ్మకి చెప్పలేదా ఇదేం బాగులేదని?”
“వాళ్లమ్మంటే అఅమ్మాయికి భయం. అట్టా చెప్పితే, ఆమెకి కోపం వచ్చి కొడుతుందేమోనని చెప్పలేదు. ఆతరవాత ఒక ఉపాయం ఆలోచించింది”
నేను నిటారుగా కూచున్నాను ఊపిరి బిగబట్టి. .
“ఒకరోజు, ఆచిన్నమ్మాయి బొమ్మలతో అమ్మాట ఆడుకుంటోందిట, ఎంచక్కా అమ్మమాదిరి తను కూడా మడి కట్టుకుని, వంట చేసి, ఆబొమ్మకి తిను, తిను అంటూ తినబెట్టిందిట. కాని ఆబొమ్మేమో తినలేదు. అప్పుడు ఆఅమ్మాయేమో నాబొమ్మ బువ్వ తినటంలేదూ అంటూ ఏడవటం మొదలెట్టిందిట.
వాళ్లమ్మ అది చూసి, ‘చిలకలకొలికీ, చినదానా, బొమ్మలు బువ్వలు తిందురటే’ అందిట నవ్వుతూ.
అప్పుడేమో ఆఅమ్మాయి, ‘మాయలదానా, మహిమలదానా, మనుషులు కప్పల కందురటే’ అందిట చమత్కారంగా.
అప్పుడు చిన్నరాణి తను చేసిన తప్పు తెలుసుకుని, పెద్దరాణీకి నిజం చెప్పి, పెద్దమ్మాయిని పిలుచుకొని వచ్చి, ప్రేమగా చూసుకోసాగిందిట.” అంటూ ముగించేరు అత్తయ్యగారు.
నామనసు కుదుటపడింది. హమ్మయ్య. మంచిఅమ్మాయికి కష్టాలు పోయేయి. చిన్నమ్మాయి తనతెలివితేటలతో తనతల్లి పాడుబుద్ధిని మార్చేసి, మంచిదాన్ని చేసేసింది. కొంచెంసేపు నేనేమీ మాటలాడలేదు. తరవాత నెమ్మదిగా అడిగా, “పొగ పెట్టటం ఏమిటిండీ అత్తయ్యగారూ,” అని, ఇందాకటిమాట గుర్తొచ్చి.
“చీకటి పడుతోంది. మీఅమ్మగారు ఎదురుచూస్తూంటారు. రేపు చెపుతాలే.” అని నన్ను ఇంటికి పంపేశారు ఆరోజుకి.
000
అప్పుట్లో మేం గుంటూరుదగ్గర మంగళగిరిలో వుంటూ వుండేవాళ్లం. ఇది నాకు బాగా గుర్తుండిపోయిన, అలనాటి తొలికథ, ఇంకా మర్రిచెట్టు తొర్రలో ప్రాణాలు దాచుకున్న రాక్షసులూ, ఏడుమల్లెపూవులఎత్తు రాకుమార్తెల కథలూ రోజూ చెప్పిన అ అత్తయ్యగారిపేరు రామడుగు లలితాంబగారు. మామయ్యగారిపేరు నరసింహంగారు. వారింటి తలుపులు సదా నాకోసం తెరిచివుండేవి. అత్తయ్యగారు నాకోసం ఎదురుచూస్తూ వుండేవారు రోజూ.
నిజంగా ఆవిడకీ మాకూ ఏచుట్టరికమూ లేదు కాని ఆరోజులు అలాటివి. పెద్దలని వరసపెట్టి పిలవడం, లేని చుట్టరికాలు కలుపుకుని ఆప్యాయతలు పెంచుకోడం సర్వసాధారణం. అంటే మాఅత్తయ్యగారు కూడా అందరితో పాటే అనికాదు. ఆవిడకి ఆవిడే సాటి నామటుకు నాకు మరో అత్తయ్యగారు లేరు.
మానాన్నగారిఉద్యోగరీత్యా మేం కొత్తగా మంగళగిరిలో స్థిరపడినరోజులు అవి. నేను చింతకింది కనకయ్యగారి హైస్కూలులో ఫస్టుఫారంలో చేరాను. స్కూలినించి నడిచి ఇంటికి వస్తుంటే, దారిలో, మాయింటికి మలుపు తిరిగేముందువీధిలో రెండిళ్లకి ఇవతల అత్తయ్యగారిల్లు వస్తుంది. అరుగుమీద మామయ్యగారు వాలుకుర్చీలో కూర్చుని, పేపరు చదువుకుంటుంటే, అత్తయ్యగారు స్థంభానికానుకుని కూర్చుని, అప్పుడే కోసిన కనకాంబరాలూ, మరువం, మల్లెలూ మాల కడుతూ, ఏ ఊర్మిళాదేవి నిద్రో పాట పాడుకుంటూ కనిపించేవారు. మాయింట్లో మాఅమ్మవేపూ, నాన్నగారివేపూ కూడా పెద్దలు అప్పటికే తరించిపోయారు. పైగా అటూ ఇటూ కూడా మా అమ్మా, నాన్నగారే తొలిసంతానం. అంచేత నాకు అందరు పిల్లల్లా చెప్పుకోడానికి అమ్మమ్మలూ, తాతగార్లూ, లేరేమో, ఈదంపతులని చూస్తుంటే ఏదో చెప్పలేని తమకం తగిలేది మనసులో నాకు.
నేను వారినిద్దరినీ పరీక్షగా చూస్తున్నానని నాకు తెలీలేదు ఆమె ఒకరోజు తలెత్తి నావేపు చూసి నవ్వేవరకూ. నేను సిగ్గుపడి పరుగెత్తుకుంటూ ఇంటికొచ్చేసేను. మరునాడు ఆమె దా అంటూ పిలిచారు. నేను జంకుతూనే దగ్గరికి వెళ్లాను.
నేను బాగా దగ్గరగా వచ్చినతరవాత, ఆమె చిరునవ్వుతో, నారెండుబుజాలు పట్టుకుని, నన్ను వెనక్కి తిప్పి, నాజడలో చిన్నపాయ తీసి, చేతిలో వున్న కదంబమాల ముడిచి తురిమారు. మళ్లీ తనవేపు తిప్పుకుని, “నీపేరేమిటి?” అని అడిగారు.
“మాలతి అండీ,” అన్నాను నెమ్మదిగా.
“ఎంచక్కా వున్నావు బాలాత్రిపురసుందరిలా,” అన్నారామె.
నాకు చెప్పలేనంత సిగ్గూ, సంతోషమూ ముంచుకొచ్చేయి. నేను మాటాడకుండా ఒక్క వురుకున ఇంటికి చేరుకున్నా.
“ఆపువ్వులెక్కడివి?” అంది అమ్మ.
“పక్కవీధిలో వుండే అత్తయ్యగారు పెట్టేరు,” అన్నాను.
అమ్మ తిడుతుందేమో అనుకున్నాను కానీ, తేలిగ్గానే పోనిచ్చేసింది, “తిన్నగా ఇంటికి రాకుండా ఆపెత్తనాలేమిటి” అనేసి, తనపనిలో పడిపోయింది.
వరసగా నాలుగురోజులు ఇలా జరిగింది. అయిదో రోజు, అత్తయ్యగారు, నాతలలో పువ్వులు పెట్టబోతూ, “ఇదేం జడ ఒగ్గులొగ్గులుగా” అన్నారు.
“మాఅమ్మ బయటుందండీ. అంచేత నేనే వేసుకున్నా,” అన్నాను.
“ఇంటికెళ్లి, మీఅమ్మతో చెప్పిరా. కుదుమట్టసంగా దువ్వి మళ్లా జడ వేసి చెండు తురుముతా,” అన్నారామె.
నేను సరేనండీ అని పరుగెత్తుకుంటూ వెళ్లి అమ్మకి చెప్పాను.
“ఆవిడకి మరేం పనిలేదూ నీకు జడలేస్తూ కూచోడానికి. ఇప్పుడేం వద్దు,” అంది అమ్మ.
“అత్తయ్యగారే వేస్తానన్నారు,,” అన్నాను నేను రొకాయిస్తూ.
“ఆవిడేదో మర్యాదకి అనివుంటారు. వద్దని చెప్తున్నానా,” అంటూ కసురుకుంది అమ్మ.
నేను గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ పెరట్లోకి వెళ్లిపోయాను. నాకు కోపం వస్తే పెరట్లో జామచెట్టెక్కి కూచుంటా. అమ్మ మంచికళనుంటే, వచ్చి, మంచిమాటలాడి లోపలికి తీసుకెళ్తుంది. లేకపోతే, అదే వస్తుంది అని వూరుకుంటుంది. ఇప్పుడు తను కూడా ఇంట్లోకి వెళ్లదు కనక, రెండోవరసే జరిగింది. నేను రెండు జామకాయలు తిని ఇంట్లోకి వచ్చేసాను మంచినీళ్లకోసం.

మర్నాడు స్కూలినుండి వస్తుంటే, అత్తయ్యగారు చూసి, నన్ను ఆపి, ఆడిగారు, నిన్న రాలేదేం అని.
“ఆవిడకి మరేం పనిలేదూ నీకు జడలేస్తూ కూచోడానికి అందండీ మా అమ్మ,” అని చెప్పాను, నాదేం తప్పులేదని చెప్పడానికి.
అత్తయ్యగారు నవ్వి, “ఫరవాలేదు, అత్తయ్యగారే వేస్తానన్నారూ, మీ అమ్మ స్నానం అయేవరకూ, రోజూ ఉదయమే రా, జడ వేస్తాను అని అత్తయ్యగారు చెప్పారని మీఅమ్మకి చెప్పు” అన్నారు.
నేను సంతోషంగా ఇంటికి వెళ్లి, మాఅమ్మతో “ఫరవాలేదు, అత్తయ్యగారే వేస్తానన్నారూ, మీ అమ్మ స్నానం అయేవరకూ, రోజూ ఉదయమే రా, జడ వేస్తాను అని అత్తయ్యగారు చెప్పారని మీఅమ్మకి చెప్పు” అని చెప్పమంది అని చెప్పాను. అలా మొదలయింది మా అనుబంధం. అసలు చాలారోజులవరకూ మాఅమ్మా అత్తయ్యగారూ కలుసుకోనేలేదు. నేనే అత్తయ్యగారిలా చెప్పమన్నారని అమ్మతోనూ, అమ్మ ఇలా అందని అత్తయ్యగారితోనూ రాయబారాలు నడుపుతూ వచ్చేను. ఆరోజుల్లోనే అత్తయ్యగారు నాకు శ్రీకృష్ణరాయబారం కథ చెప్పారు జడవేస్తూ.
అలా నాకు జడ వేస్తూ కథలు చెప్పడం మొదలయింది. తరవాత, సాయంకాలాలు, స్కూలినించి ఇంటికొచ్చి, కాఫీ తాగి, “అత్తయ్యగారింటికెళ్తున్నా” అని అమ్మకి చెప్పి వాళ్లింటికి వెళ్లేదాన్ని.
అమ్మ “రోజూ ఎందుకు . ఆవిడ పనులు అవిడని చేసుకోనీకుండా కాళ్లకడ్డంపడుతూ,” అంది ఓరోజు.
అత్తయ్యగారే రమ్మన్నారని నేను పట్టుబట్టి వెళ్లాను. రోజూ ఎందుకు? అవిడని పని చేసుకోనీకుండా కాళ్లకడ్డంపడుతూ అంటోందండీ మాఅమ్మఅని కూడా చెప్పాను అత్తయ్యగారికి.
“నువ్వు నాకాళ్లకడ్డం పట్టంలేదని చెప్పు మీఅమ్మగారికి,” అన్నారు అత్తయ్యగారు ఎప్పటిలాగే నవ్వుతూ.
నేను మళ్లీ ఆమాట మోసుకొచ్చి మాఅమ్మకి చేరేసేను. మాఅమ్మ కూడా నవ్వుతూ, “ఆవిడకి ఆడపిల్లల్లేని ముచ్చట తీరిపోతున్నట్టుంది,” అంది.
అత్తయ్యగారికి ఒక కొడుకు. ఆఅబ్బాయి బెంగుళూరులో చదువుకుంటూ వుండేవాడు. అంచేత వాళ్లింట్లో నేను వాళ్ల అమ్మాయిలాగే మసలుతూంటేదాన్ని.
నాజీవితంలో నాకు తారసపడిన ఎంతోమందిని మరిచిపోయాను..ఎన్నో సంఘటనలు మర్చిపోయాను. ఉపాయాలతో, వాదనలతో బుద్ధులు మార్చేయగలమని నమ్మేరోజులు పోయేయి. నిజజీవితంలో నాఅనుభవంలో ఎవరూ “సరేనండీ, మీరు చెప్పారుకనక మారిపోతాను” అంటూ మంచివాళ్లయిపోయినవాళ్లు నాకు తటస్థపడలేదు. నేను రాసే కథలన్నీ సుఖాంతాలు కావు. కానీ, ఇప్పటికీ కథల్లో మంచివాళ్లబాధలు తొలిగిపోతేనూ, దుష్టులు శిష్టులు అయిపోతేనూ అదోరకం మనశ్శాంతి.
ఆరుదశాబ్దాల పూర్వం ప్రతిరోజూ, స్కూలయింతరవాత చల్లని సాయంకాలాలు, నాయీడు పిల్లలందరూ వీధుల్లో ఆడుకుంటుంటే, అత్తయ్యగారి వంటింటిలో కూర్చుని నేను విన్నకథలూ, ఆకథలు చెప్తూ నన్ను అలరించిన అత్తయ్యగారూ పదిలంగా సుస్థిరంగా నామనోఫలకంపై నిలిచివున్నారు ఈనాటికీను, జననాంతర సౌహృదాని అంటే ఇలాటివే అనిపిస్తుంది నాకు.

000

(జనవరి 200 8)

ఊసుపోక - నాదినము

(ఎన్నెం కతలు 8 - నా దినం)

రానున్న ఆదివారం అమ్మదినం. ఆశుభసందర్భంలో నాదినం ఎలావుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే కొత్తగా పరిచయం అయినవాళ్లు నన్ను సాధారణంగా అడిగే మూడో లేక నాలుగో ప్రశ్న “మీరేం చేస్తారండీ రోజంతా“ అని.
ఎందుకంటే మొదటి రెండో లేక మడో ప్రశ్నల్లో తెల్లమయే విషయాలు - ఉజ్జోగంలేదు సజ్జోగం లేదు. సాకడానికి చిన్నా పొన్నా పిల్లల్లేరు. (సరయూని నావంతు సాకడం అయిపోయిందిలెండి), సోషలైజు చేయడానికి సావాసాల్లేవు, మరి పొద్దెలా పోతుందని,
ఏంచేస్తున్నానా అని రోజులతరబడి ఆలోచించగా తేలినసంగతి ఇదీ. నాదినం దానంతట అదే గడుస్తుంది.
మామూలుగా నిత్యనైమిత్తికాలు రోజుకి నాలుగో అయిదో వుంటాయి. లేస్తూనే ఓచిన్న జాబితా రాసుకుంటాను. రెండో మూడో అనుకున్నట్టు అవుతాయి. కానివి రేపటికి వాయిదా.
అది కాక నాకు ముగ్గురు స్నేహితులున్నారు. నెలకోసారీ, మూడునెలలకోసారీ, ఆరునెలలకోసారీ పిలిచేవారు. (గమనికః సైటులద్వారా నీలితెరమీదకొచ్చి కబుర్లు చెప్పేవారు ఈలెక్కల్లోకి రారు)
అందులో మూడోకేటగిరీకి చెందినావిడ పిలిచారు ఇందాకా. వారు దేశంలో కులపెద్దలు. అంటే కాస్త రాజసం గలవారు అంటే అపార్థం చేసుకోకండి. నేను సదుద్దేశంతోనే చెప్తున్నా. సాంప్రదాయకమయిన మర్యాదలూ, మన్ననలూ తెలిసినవారు అని. నేను సాంప్రదాయకురాలినని ఆవిడ నమ్మకం. నానిజరూపం ఆవిడకి తెలీదని నానమ్మకం :p.
ఆవిడకీ నాకూ మాటాడుకోడానికేం వుండవు కానీ ఆసాంప్రదాయక మర్యాదలప్రకారం ఠంచనుగా ఆరునెలలకోమారు హలో చెప్పి హలో చెప్పడానికి పిలిచానని చెప్పుతుంటారు.
“హలో“
“హలో“
″ఏం చేస్తున్నారండి″ అన్నారావిడ.
″ఏంలేదండి. కంప్యుటరు పడుకుంది. ఏమైందా అని చూస్తున్నాను″ అన్నాన్నేను.
″అంతేనండీ ఈమెషీనులూ.. ఈరోజు మా ఫాక్స్ రింగవడంలేదు. పని చేస్తోంది కాని రింగవడంలేదు.″
″ఆహా, అలాగా.″
ఆవిడ కొంచెం సందేహిస్తూ, ″చూస్తారా″.
నేను, మర్యాదగానే, ″వద్దులెండి. నాకంప్యూటరుమీద ఏదో చేస్తాను కానీ …. వేరేవాళ్ల మెషీనులంటే ….″ అన్నాను.
″అవునులెండి. అదే మరి … చెప్పలేం కదా.″
అలా సుమారుగా అదే అర్థం వచ్చేమాటలలో మరో పదినిముషాలు హలోలాడుకుని శలవు పుచ్చుకున్నాం ఈపూటకి.

టైము చూశాను. చూస్తుండగానే పదకొండవుతోంది. ఏదేనా తింటే బాగండు అనుకుంటుండగనే మళ్లీ ఫోను. నాఋణభారం తగ్గిస్తాం అంటూ. ఇదో బాధ. నాకు లేని ఋణాలు, అక్కరకు రాని వారంటీలూ, అవసరంలేని లాంగ్ డిస్టెంటు సర్విసులూ … నాకు అర్థం కాదు. నాకు లేనిఋణం వాళ్లెలా తగ్గించగలరు? మహ చిరాకేస్తుంది.

సరి. వంటగది ప్రవేశించేను. క్షణాలమీద అయిపోయే టిఫినులకిది సమయం కాదు. నాలుగు పచ్చిమిరపకాయలో గుప్పెడు కాకరకాయలో కసిక్ కసిక్‌మని నరికేస్తే మనశ్శాంతి. సుతారంగా కొత్తిమీర తరగడంనుంచి ఠప్పుమని కొబ్బరికాయ కొట్టడం వరకూ ఏరోజు ఏంచేస్తానన్నది ఆనాటి చిరాకుస్థాయిని బట్టి వుంటుంది. వేరు చెప్పనేల, బాగా ఇరిటేటయినరోజున మాంఛి టిఫిను! అది టెలిమార్కెటర్లు చేసే సంఘసేవ.
ఆతరవాత …
లాప్టాప్ తీసి ఇందాక ఆపేసిన రిపేరు మళ్లీ మొదలెట్టాను. అది ఒకటే నస ఓపెనవనని. ఏదో సిస్టమ్ ఫైలు డిలీట్ చేసేసినట్టున్నాను నిన్న. టెక్ సపోర్టుని పిలవడమా, స్టోరుకి తీసుకెళ్లడమా అని ఆలోచించాను కొంచెంసేపు. వారంటీకి కాలదోషం పట్టింది కనక ఎలా చూసినా కాసిని డాలర్లు తగలెయ్యక తప్పదు..
కాని ముందు నేను చెయ్యగలిగిందేదో చూసేస్తే తరవాత వాళ్లకి అప్పజెప్పేయొచ్చు. చెడినకాపురం చెడనే చెడిందన్న సామెత నెమరేసుకుంటూ, సిస్టమ్ రెస్టోరుతో మొదలెట్టాను.
ఓపూటంతా కుస్తీ పడితే రెస్టోరయింది కాని “లాగాను‌“ అవనివ్వడానికి పేచీ.. తప్పదేమో దాన్ని పుట్టింటికి తోలీడం అనుకుంటూనే ఎప్పుడో మాడిపార్ట్‌మెంటువాళ్లిచ్చిన ఫ్రంటుపేజి గుర్తొచ్చింది. సరే పెట్టిచూద్దాం అని తీశాను. ఆసిడిలో మొత్తం ఓయస్ వున్నట్టుంది. అప్పుడే గద్దెనెక్కిన కుర్రబాసులా కొంత బెట్టు చేసి దారిలోకి వచ్చేసింది. హా.

దానికి ప్రాణం పోసేక, ఏప్రోగ్రాములున్నాయో, ఏవి మట్టి కరిచేయో చూడ్డం రెండో మెట్టు.
స్క్రాబుల్ ఎక్కించేను. మరి ఎక్కించిన తరవాత ఆడాలి కద. లేకపోతే మెవను (కంప్యూటరు ఈఆటకోసం తనకి తాను ఇచ్చుకున్న పేరు) నొచ్చుకోవచ్చు.
ఆడుతుంటే అది నన్ను మోసం చేస్తోంది అనిపించింది. ఆటలో నామాటలని అది ఛాలెంజి చేయొచ్చు కాని నేను దాన్ని ఛాలెంజి చేసే వసతి లేదు. ఆప్రోగ్రాం రాసినవారు నిఘంటువు దగ్గరపెట్టుకునే చేసారనే అనుకుందాం. కాని కొశ్చెను చేసే వసతి నాకు వుండాలా, అఖ్కర్లేదా‌? మాటవరసకి, నేను jew అని పెడితే, కొట్టిపారేసింది. taj అని పెడితే ఒప్పుకుంది. రెండూ సర్వనామాలే కద. ఇది అన్యాయం, అక్రమం, ప్రజాస్వామ్యసిద్ధాంతాలకి విరుద్ధం. … ప్చ్. ప్చ్.. అని కొంచెంసేపు అరుచుకుని ఆట ఎత్తిపెట్టేశాను. .

ఆతరవాత, మూవీమేకరు తీసి చూశాను. చూస్తుంటే ఆమధ్య వచ్చిన మెయిలొకటి గుర్తొచ్చింది. ఎవరో ఔత్సాహిక మూవీమేకరు, “‌నాకు మీకథలు చాలా ఇష్టం, ఓ ప్రేమకథ రాసివ్వండి. సినిమా తీద్దాం“ అని రాశాడు. నాకు నవ్వొచ్చింది. ఆయనగారు నిజంగా నాకథలు చదివుంటే, ప్రేమకథలు అడిగేవాడా, హాహాహా.
మరి నేను సినిమా తీస్తే ఎలా వుంటుందో.. …
మామూలుగా నేను రోజూ వాక్కళ్తాను. ఉజ్జోగాలున్నవారు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్లకీ, తదితరులు మాలులకీ చేరుకున్నాక, వీధులు అడవుల్లా ఉంటాయి. అప్పుడు నాకు నడవడం ఇష్టం.
రోజూ నడిచేదారే … నాలుగేసి నెలలకోమారు చెట్లు కొత్తరంగులు పులుముకుని వింతశోభలు వెదజల్లుతూ చూపరుల నలరిస్తుంటాయి.. నిన్న వచ్చింది ఈదారేనా అనిపిస్తుంది.
నిన్నటివరకూ అస్థిపంజరాల్లా వున్న కొమ్మలు కొత్తచివుళ్లు తొడుక్కుంటాయి. వర్ణించలేని వర్ణాలతో కనులపండువుగా చూడ ముచ్చటగా వున్నాయి.
అలవాటుప్రకారం బయల్దేరుతూ, కెమెరా, డిజిటల్ రికార్డరూ కూడా తీసుకుని చూస్తూ నడుస్తున్నాను.
పక్షులు తీవ్రంగా తారస్థాయిలో చర్చించుకుంటున్నాయి.. నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ
“గింజలు పిండుకు కారుల్లో పోసుకుంటున్నారు, చెట్లు కొట్టి కాయితాలూ, సంచులూ చేసుకుంటున్నారు. ,… మనంవిప్పుడు తీసుకోవాలిసిన చర్యలేమిటీ …” అనేమో… .
మన యువ కని బ్లాగరులనందరినీ తలుచుకున్నాను. వారిలో ఒక్కరయినా ఇప్పుడు ఇక్కడుంటే ఎంత మంచికవితలు వచ్చేవో అని కొంచెసేపు బాధ పడిపోయేను.
సరి. ఇదుగో నా మినిటుంబావు మూవీ. ఇది నాగాజుకన్ను. ఇది నేను నడిచినదారి. ఇహ. మీఓపిక, నాప్రాప్తం.
ఇదుగో లింకు. నాదినం. (http://thulika.net/temp.vyahaali.wmv). నాదినం లింకు పని చెయ్యకపోతే ఈ ఎడ్రెస్ చూడండి.

అంటే ప్రతిరోజూ ఇలాగే గడుస్తుందని కాదు. రోజూ ఏదో వోటి వుంటుందనే. …
ఈ వ్యాపకాలమధ్య అంతర్జాలంలో ఈనాటి సాహిత్యావలోకనం చేస్తాను,
ఇంకా మధ్యలో, చాటుల్లోనూ ఈమేలుల్లోనూ నాబాత్‌చీత్ సమాంతర పట్టాలమీద సాఫీగా సాగిపోయే హౌరా ఎక్స్ ప్రెస్‌. సమాంతరాలు ఎందుకంటే వారికీ నాకూ వయసులో అభిరుచుల్లో చాలా ఏనాటికీ కలవని రైలుపట్టాలలాటివే కనక. నాకు ఇలాటి స్నేహాలే ఎక్కువ.
వీటన్నిటిమధ్యా రాయడమో, ఏంరాయనా అని ఆలోచించుకోడమో కూడా చేస్తుంటాను. అన్నట్టు టీవీకూడా సరదాగానే వుంటుంది.
హుమ్. టూమెనీ “మధ్య”లు … ఇన్ని మధ్యలమధ్య తోచదనుకునే తీరికేదీ!
గమనిక 2. మధ్యలో డి.యన్.డి రోజులు (do nothing days) కూడా వుంటాయి.

ఇంతటితో నాదినం సమాప్తం.
శ్రీశ్రీశ్రీ మంగళం మహత్.

(మా.ని. ఏప్రిల్ 2008. ).

నీలితెరలమాటున

నీలితెరల మాటు

కంప్యూటరుముందు కూర్చుని వెబ్బుమబ్బుల్లో ఓలలాడుతోంది నీల కాని మనసంతా రాబోయే మెయిలుమీదే వుంది.
తెల్లార్తూనే తొలికప్పు కాఫీలాగానే ఈమెయిలు కూడా అలవాటయిపోయింది వారం తిరక్కుండా.
కిందటి మంగళవారం వచ్చింది మొదటి మెయిలు. ఆరోజు నీలకి ఆదేమంత ప్రత్యేకంగా అనిపించలేదు. ఎవరో రామలక్ష్మిట ఓ మెయిలు పంపింది.
తనేదో మెయిలు చూసుకుంటుంటే ఓమూలని వెలిగిన కవరుబొమ్మ చూసి నీల యదాలాపంగా నొక్కింది దాన్ని.
“కొత్తతలపులు” సైటులో మీకవిత ఇప్పుడే చూశాను. చాలా బావుంది″. - రామలక్ష్మి.
″థాంక్స్ అండీ″. జవాబు కొట్టింది నీల
ఆవిడ ఇంకా లైనులో వున్నట్టుంది.
″మీరు ఇంకా ఏం రాసారు? మీజవాబు అవును ఐతే ఎక్కడ?″ -రా
″లేదండీ. ఇదే ఓం ప్రథమం ,″ నీల జవాబిచ్చింది చిన్నగా నవ్వుకుంటూ.
″ఆలాగా! తొలిపలుకే మెరుపులా మురిపించింది.. రాస్తూ వుండండి″. -రా
″నేనంత రచయిత్రిని కానండీ. ఎప్పుడో తోస్తే నాలుగులైనులు గిలుకుతాను అంతే″ - నీ.
″మీకు మంచి భావుకత వుంది″. - రా.
″అమ్మో మరీ అలా పొగిడెయ్యకండి. మరోసారి థాంక్స్.″ -నీ
″పొగడ్త కదండీ.. ప్రతిభవున్నచోట వుందని ఒప్పుకోవాలి కద. చెక్కభజన కాదులెండి″ … రా.
″మీరేమాటైనా ఇంత సూటిగా చెప్పేస్తారేమిటి?″ - నీ.
″ఆహా, నిక్షేపంగా. సరే వుంటానండి. మళ్లీ రేపు మాటాడుకుందాం.″ - రా.
ఇద్దరూ నవ్వుకున్నారు రెండు నీలితెరలమాటున, రెండుసంద్రాలకి చెరోవైపునా.
000
ఆమర్నాడు నీల మరెవరిదో ఓ కవిత చూసింది. తనకి చాలా బావుందనిపించింది. ఆపూటంతా ఆకవిత తనని వెన్నాడుతూనే వుంది. ఆసాయంత్రం కూచుని మెయిలు చూస్తూంటే, రామలక్ష్మి ఈకవితగురించి ఏం అంటారో అనిపించి, వెంటనే ఓమెయిలు కొట్టింది.
″హలో. ఈవారం ″కొత్తలుపులు″లో ″మబ్బుతునక, మంచుముక్క″ కవిత చూశారా? మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.″ - నీ
అవతల ఆవిడ లైనులో వుంది. వెంటనే జవాబు, “నేనూ ఇప్పుడే చూశాను, నేనూ అంతే. అదే మీరేం అనుకున్నారో అని :->″ - రా
“అందులో భావావేశం వుంది కాని కవితలా అనిపించలేదు. అయినా నాకు కవితలగురించి అంతగా తెలీదులెండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను” - నీ.
“కవిత అన్నది మూరెడూ, జానెడూ అంటూ కొలవలేం కదా. ఒకొక్కరు ఒక్కో కోణానికి స్పందిస్తారు. ఇప్పుడు ఈకవితే చూడండి. మీకేమో అందులో ఆవేశం కనిపించింది. నాకేమో పదవిన్యాసం బావుందనిపించింది. ఒకే కవిత అయినా కారణాలు వేరు కావచ్చు కదా.” రా
″ఏమోమరి. నాకు షడ్రుచులతో విందు చేసింతరవాత తాంబూలం తక్కువైనట్టనిపించింది చివరకి ;-)″ - నీ.
″^D. హా. తాంబూలం ,,, ఇప్పుడు తాంబూలాలెక్కడ?. బ్రెత్ ఫ్రెషనరులే కద ఎక్కడ చూసినా :-p.″ - రా
″బ్రెత్ ఫ్రెషనరా? ఎక్కడున్నారేమిటి?″ -నీ.
″ఇంకెక్కడ, కలియుగ భూతలస్వర్గం. అట్లాంటిక్కి ఆవలిగట్టున మీవేపునించి చూస్తే″. -రా
″మీరు కవిత్వం రాస్తారా?″ - నీ
″లేదు. చదవడానికే చాలడం లేదు ఎక్కడలేని టైమూను. అయినా నేను కూడా ఎందుకులెండి చెయ్యెట్టడం అందులో -: )″ - రా
″సరేలెండి. ఇప్పటికింతే సంగతులు.″ -నీ.
000
అచిరాకాలంలోనే ఈమెయిళ్లలోంచి చాటులోకి దిగిపోయారిద్దరూ. ఇంచుమించు రోజూ కనీసం ఓఅరగంటసేపు చాటుకచేరీ పెట్టేసుకుంటున్నారు హుషారుగా. కవితలూ, కథలే కాక ఇతర విషయాలు, కదాచితుగా వ్యక్తిగతవిషయాలూ కూడా మేలాడుకోడం, మేలమాడుకోడం కూడా మామూలయిపోయింది. తమకే తెలీకుండా ″మీరు″లొదిలేసి ″నువ్వు″లలోకి కూడా మారిపోయారు.
“ఇంతకీ అమెరికాలో ఎక్కడ నివాసం? ఏంచేస్తున్నావు?” అనడిగింది నీల రామలక్ష్మిని.
“నేను చికాగోలో వున్నాను. నాకూ అదే ఆలోచన - ఏంచేస్తున్నానా అని ఆలోచిస్తూంటాను :p.”
″నేను కంప్యూటరు సైన్స్ చేస్తున్నా. రెండో ఏడు″ నీల తను చెప్తే ఆవిడ చెప్తుందేమో అనుకుంది.
″హా. బాగుంది.″ - రా.
“నీది ఏ ఫీల్డు?” -నీ
“ఏఫీల్డూ లేదు. కాలేజీ ఒక ఏడాది వెలగబెట్టేనంతే.” -రా.
తను మరీ పొడిచి పొడిచి అడుగుతున్నానేమో అనిపించి నీల అక్కడికి ఆప్రశ్నలు ఆపేసింది. ఈవిడెవరు, ఏంచేస్తోంది అన్న ఆలోచనలు అలాగే వుండిపోయేయి.
బహుశా కాలేజీలో చదువుతుండగా ఏవిదేశీ పెళ్లికొడుకో దిగేడేమో. ఈపెళ్లికొడుకులు రావాలే కాని సుమూహార్తాలు ఇట్టే దొరుకుతాయి. పెళ్లికొడుకులకి శలవు దొరికినసమయానికి సరిగ్గా పజిల్లో ముక్కలు అతుక్కున్నట్టు కనివిని ఎరగని శుభముహూర్తం కలిసొచ్చేస్తుంది. ఏసద్బ్రాహ్మణుడో సాక్షాత్తు దేవతలు పెట్టిన కల్యాణఘడియలు కనిపెట్టేసి పుణ్యం కట్టుకుంటాడు.. దేవతలు స్వయంగా వచ్చి దీవిస్తారని కూడా ప్రమాణం చేస్తాడు. నీల నవ్వుకుంది. ఇదంతా కేవలం తన ఊహాగానమే కావచ్చు కాని అనుకోడానికి సరదాగా వుంది.
తను అమెరికాలో నెట్‌చాటులలో పొంచుండి పిల్లలని వంచించే దుష్టులగురించి కూడా వింది. ఈ రామలక్ష్మి కూడా అలాటి దొంగపేరు కావడానికి ఆవకాశం వుంది కదా అన్నమాట తలుచుకున్నప్పుడు నవ్వురాలేదు. కాని ఎందుకో కొంచెంసేపయినతరవాత అలా అనుకోడమే మహా పాపమనిపించింది. ఆత్మనా లెంపలేసుకుందేమో కూడాను.
ఆవిధంగా వరసగా ఈమెయిలులు హౌరా ఎక్స్‌ప్రెస్‌లా సాగిపోయేయి కొంతకాలం.
000
″ఇందాకా మాఅమ్మ విశ్వంమామయ్య వస్తారు మాటాడమంది. తను పక్కింటికి వెళ్తున్నానని″ - నీల
″సరే. సిద్ధం అవు మరి.″ - రా.
″ఏంమాటాడతానాయనతో. మాతాతగారివయసు ఆయనకి. ఏంవుంటాయి ఆయనకీ నాకూ మాటాడుకోడానికి? అన్నాను అదే ఆమాట మాఅమ్మతో అన్నాను″ -రా.
రామలక్ష్మి కొంచెంసేపు వూరుకుని, ″ఏంచేసావు మరి?″ అని అడిగింది.
″మాఅమ్మేమో ఆయన మనిషే కదా, ఆశృతిపెట్టెకంటె నయమే కదా అంది చిరాగ్గా.″ -నీల
″శృతిపెట్టేమిటి?″
″అదే నా లాప్టాపు. ఇది రాకముందు నేను తనతో సరదాగా వూసులాడుతూ వుండేదాన్ని. మేం ఇద్దరం అసలు అమ్మా కూతుళ్లలా కాక అక్కచెల్లెళ్లలా కబుర్లూ, ఎకసెక్కాలూను..″ -నీ.
″ఇప్పుడు మానేశావేమిటి?″ - రా.
″ఇప్పుడు ఈకంప్యూటరుమూలంగా అంతసేపు తనతో గడపడం లేదని మాఅమ్మకి కోపం.″
″:p. అదేం బాగులేదు. నేను మీఅమ్మతరుఫే..″
″;). అన్యాయం. ముందొచ్చిన చెవులకంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే..″ - నీల
″మరే .)″
000
″నిన్న చదవమని ఓస్నేహితురాలు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని ఓపుస్తకం తెచ్చిచ్చింది. నువ్వు చదివావా?″ -నీ
“లేదు, లేదు. రెండు ప్రశ్నలకీను.” - రా.
″మానేస్తురాలు చెప్పడం అలాటి పుస్తకం అదొక్కటే అని. కనివినిఎరగం అసుమంటి బుక్కు అంటుంది″ - నీ
″:p. ఆమాటకి అర్థం ఎలాగైనా చెప్పుకోవచ్చు.″ -రా
″ఏమో, చదివి చెప్తాలే.″ -నీ
000
“నిన్న తారే జమీన్ పర్ సినిమా చూశాను. నువ్వు చూసావా?” - నీల
“నేను సినిమాలు అంతగా చూడను..నేను చివరిసారిగా చూసింది ప్రాణమిత్రులు అనుకుంటాను..” -రా.
“అయ్యో రామా. అది వచ్చేనాటికి నేనే కాదు మాఅమ్మయినా పుట్టిందో లేదో. :p. ఆతరవాత నువ్వు సినిమాలే చూడలేదా?”- నీ.
“ఏమో మరి, నాకు ఆపాత సినిమాలే బావుంటాయి.” -రా.

“సరే. పుస్తకాలగురించి మాటాడుకుందాం. ఏ రచయితలు ఇష్టం?” -నీల
″నువ్వు Bridge on the river Kwai చదివావా?″ -రా
″ఎప్పుడూ వినను కూడా లేదు. ఎవరు రాశారు?″ -నీ.
″పేరు గుర్తు లేదు, కాని చాలా బాగుంది. చిన్నపుస్తకమే. సినిమా కూడా వచ్చింది″ -రా.
″నీకెక్కడ దొరుకుతాయి ఇవన్నీ. నువ్వు చెప్పేవన్నీ అమ్మమ్మలకాలంవి. ఆతరవాత సాహిత్యం లేదనుకుంటున్నావేమిటి. :P.″ నీ
″నువ్వు చెప్పినవి నాకూ తెలీదు కద. సాహిత్యం సాగరం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలి?″ - రా
″ఇవన్నీ మాలైబ్రరీలో లేవు. నీకెలా దొరుకుతున్నాయా అని″. -నీ
″మా అమ్మమ్మకి చదవడం చాలా ఇష్టం. ఆవిడే ఓ ఎన్‌సైక్లోపీడియా. 1870తరవాత ఏపుస్తకం అడగు. మొత్తం చరిత్ర అంతా చెప్పేస్తుంది.″ - రా
″అంటే? 1870లో వున్నారేమిటి ఆవిడ .)″ -నీ.
″అబ్భ ఆవిడ కాదమ్మా, మనకి ప్రింటింగు వచ్చింది అప్పడూ :^D. హాస్యానికన్నాను.″ - రా.
″సరేలే, ఇకమీదట వికీపీడియాకి బదులు నిన్నే అడుగుతా ఏం కావలిసినా :p.″ -నీ
″ :)) 1950కిపూర్వం అయితేనే … :p.″ - రా.
″మరి శలవా″
″వుంటానుమరి″.
.000
రెండురోజులుగా రామలక్ష్మిదగ్గరినుండి ఏమెయిలూలేదు. రవికిరణాలతో ఏతెంచే ఈ ఉదయటపాలు కనిపించకపోతే ఏం బాగోలేదు నీలకి. ఇలా హఠాత్తుగా ఆగిపోడం మర్యాదగా లేదు. ఎక్కడికేనా వెళ్లిందా? చెప్పివెళ్లొచ్చుకదా. కంప్యూటరుకష్టలేమో. అమెరికాలో కూడా ఉంటాయా?.
″హలో. రెండ్రోజులై మేలుబండి రానేదు. అంతా పనేనా?″ - నీల రామలక్ష్మికి ఓమెయిలు కొట్టి ఆరోజుకి తనపనిలో పడిపోయింది. మరో రెండురోజులు గడిచేయి. అవతల్నించి మేల్గాడీ జాడ లేదు.
″హలో. బావున్నావా? నీమెసేజిల్లేక నా ఇన్ను‌బాక్సు చిన్నబోయింది.″ -నీల మళ్లీ మరో మెయిలిచ్చింది.
000
ఆ మర్నాడు శనివారం. నీల మెయిలులు చూసుకుంటే తనకి పరిచయం అయిన ఐడితో మెయిలొచ్చింది.
″అమ్మమ్మకి బావులేదు.″
″అయ్యో. డాక్టరుదగ్గరికి తీసుకెళ్లారా?″ నీల ఆతురతగా అడిగింది. తను ఇంతకుముందు ఈనేస్తురాలిగురించి అనుకున్న మాటలు గుర్తొచ్చి నొచ్చుకుంది కూడా వెనువెంటనే..
″ఆస్పత్రిలోనే వుంది″ - ఆర్.
నీల స్క్రీనుని పరీక్షగా చూసింది. రామలక్ష్మి మామూలుగా తెలుగులో రాస్తుంది. పైగా ఆర్ అని సైన్ చెయ్యదు. అయినా మనస్సు బాగులేనప్పుడు అలవాటయినభాష ముందొస్తుందన్న దివ్యసూత్రం తలుచుకుని తను కూడా ఇంగ్లీషులోనే జవాబిచ్చింది.
″ఫరవాలేదు. అక్కడ డాక్టర్లు బాగా చూస్తారు కద. నీకు వీలయినప్పుడే రాయి″. -నీల
కాస్త విరామం. నీలకి అర్థం కాలేదు. అవతల రామలక్ష్మి వుందా? వెళ్లిపోయిందా?
మళ్లీ బాక్స్ వెలిగింది. ″నేను మీకు రాయొచ్చా?″ – ఆర్.
″అంటే?″
″యూ అమ్మమ్మాస్ ఫ్రెండ్.″ - ఆర్. .
నీలకి అయోమయంగా వుంది. తాను ఎవరితో మేలమాడుతోంది? ఎవరికి వొంట్లో బాగులేదు? రామలక్ష్మికా? వాళ్లమ్మమ్మకా?
ఎవరు మెయిలిస్తున్నది. రామలక్ష్మేనా, మరెవరేనా దారితప్పి ఇటొచ్చేశారా?
″నో. నేను రాహుల్. మాఅమ్మమ్మకి మీరు చాలా ఇష్టం″. - ఆర్.
ఇదీ మరీ గందరగోళంగా వుంది. ఎవరీ రాహులుడు?
″నువ్వు ఏ గ్రేడ్ చదువుతున్నావు?″ - నీల
″5. నేనే అమ్మమ్మకి కంప్యూటరు స్కిల్సు నేర్పింది. నాకు తొమ్మిదన్నర ఏళ్లు.″ - ఆర్.
తాను మేలాడుతున్నది రామలక్ష్మి మనుమడని గ్రహించగానే నీలకి ఫక్కున నవ్వొచ్చింది. ″అలాగా. మంచిపని చేశావు.″ అంది నవ్వుకుంటూ.
″ఆవిడకి అసలు కీబోర్డు తాకడానికి కూడా భయమే . నేను చెప్పాను తెలుగుకథలూ అవీ నెట్‌లో చూడొచ్చనీ. ఈమెయిలూ, ఇమోటికానులు అవన్నీ చూపించేను కూడా. నా ఐడీలోనే మీకు రాస్తోంది.″ –రాహుల్ హుషారుగా కొట్టిపారేస్తున్నాడు టకటక. వాడికి తాను సాధించిన ఘనవిజయం మహగొప్పగా వుందన్న సంగతి నీలకి స్పష్టం అయింది.
నీలకి మరోసందేహం. మరి రామలక్ష్మి చెప్పే అమ్మమ్మ ఎవరు?
″ఓ, అలాగా. సరే. మీఅమ్మమ్మని అడిగానని చెప్పు. … అవునూ, మీ అమ్మమ్మ వాళ్ల అమ్మమ్మ కూడా మీతోనే వున్నారా?″ -నీల.
″లేదు. అమ్మమ్మ వాళ్లఅమ్మమ్మగురించి కథలు చెప్తుంది అంతే. నేను ఎప్పుడూ చూడలేదు.″ - ఆర్.
″అవును, నాక్కూడా చెప్పింది మీ అమ్మమ్మ వాళ్ల అమ్మమ్మకథలు.″ నీల.
″మాఅమ్మమ్మకి మీరు చాలా ఇష్టం. మిమ్మల్ని ‘చిన్నినాచుట్టం’ అంటుంది. నాకు చాలా హోమ్ వర్కు , బై.″
″:). సరే. హోమ్‌వర్క్ చేసుకో. ″ -నీ.
″మాఅమ్మమ్మ తొందరగా ఇంటికి వచ్చేస్తే బాగుణ్ణు. అమ్మమ్మ ఇంట్లో లేకపోతే ఏం బాగులేదు.″
″ఫరవాలేదులే. తొందరగానే వచ్చేస్తుంది.″ నీల రాసింది ధైర్యం చెప్తూ.
″నేను మీకు రాయొచ్చా?″ - ఆర్.
″తప్పకుండాను.. రాస్తూ వుండు. మీఅమ్మమ్మకి ఎలా వుందో చెప్పు.″ -నీల.

రామలక్ష్మి తనకంటే పెద్దది అన్నమాట తెల్లమవడానికి కొంతసేపు పట్టింది. కాని నమ్మబుద్ధి కావడంలేదు. ఆవిడతో చాటు సాటి మిత్రులతోలాగే అనిపించింది ఇన్నాళ్లూ. ఆవిడ ఎందుకు ఈవిషయం స్పష్టం చెయ్యలేదు? తను విశ్వంమామయ్యగురించి చెప్పినమాట మూలంగానేమో. …చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయింది.

రేపు ఆవిడ మళ్లీ మెయిలిస్తే తను నువ్వు అంటూ రాయగలదా, రాయలేదా అన్న సదసత్సంశయంలో చాలారాత్రి అయిపోయింది ….. ఈనీలతెరలచాటు భేటీ. ఆటు ఒకతరం వెనక ఆవిడా, ఇటు ముందుతరం చిన్నవాడు, మధ్యధరాసముద్రానికి చెరోవైపునా …
పడుకోబోతూ, నీల డైరీలో రాసుకుంది, “ఈరోజు నాకు ఒక కొత్త చిన్ని నేస్తం దొరికాడు″.

000

(మాలతి. ఏప్రిల్ 200 8)

తాపత్రయం

తాపత్రయం పెద్దకథ

ఆరుద్ర కథలు సమీక్ష

ఆరుద్ర చిన్నకథలు - ఒక పరిశీలన

″సుబ్బారావున్నరగంటలసేపు″ - చూడగానే అచ్చుతప్పు కాబోలు అనిపించే ఈపదబంధం ఆరుద్రగారి కథలసంకలనంలో ″ఇందలి నీతిః చెడలేదు″ అన్నకథలోది.

సమగ్రాంధ్రసాహిత్యం, త్వమేవాహం, డిటెక్టివ్ నవలలూ, సినిమాపాటలూ, డైలాగులరచయితగా చాలామందికి గుర్తుండిపోయిన ఆరుద్ర చిన్నకధలు కూడా రాశారు. సాహిత్యంలో వివిధప్రక్రియలలో మాత్రమే కాదు, ఆయనకి జ్యోతిషం, గారడీ, నాట్యశాస్త్రంవంటి విద్యలతో కూడా పరిచయం వుంది.

1966లో ప్రచురింపబడిన ″ఆరుద్రకథలు″ చిన్నపుస్తకం. డెమీసైజు. 175 పేజీలు. 25 కథలున్నాయి. మూడు కథలు తప్పిస్తే, ప్రతికథా అయిదారు పేజీల్లో అయిపోతుంది. మొదలుపెట్టేం అనుకునేలోపున ముగిసిపోతుంది. కొన్ని అయితే మూడు పేజీలే. ఒకే ఒక సంఘటన చుట్టూ అల్లుకున్నకథలే ఎక్కువ. కొన్నికథల్లో ఓజీవితకాలం కథ వుంది. ఒక జీవితకాలాన్ని మూడు పేజీల్లో ముగించడానికి చాలా చాకచక్యం కావాలి. అది ఆరుద్రకి పుష్కలంగా వుంది. ఎక్కువభాగం మధ్యమపురుషలో పాఠకుడితో ఎదురుగా కూర్చుని మాటాడుతున్నట్టు చెప్పినవే.

ఆరుద్ర కథనం - కవితలు కానివ్వండి, కథలు కానివ్వండి సినీమాటలూ పాటలూ కానివ్వండి - చదువుతున్నంతసేపూ, వింటున్నంతసేపూ ఆరుద్రన్నరగంటలసేపు మనని తన్మయం చేస్తాయి. చివరకి ″నేను చెప్పదల్చుకున్నదేదో నేను చెప్పేశాను, మిగతాది మీరు ఆలోచించుకోండి″ అంటూ పాఠకులకి కథ ఒప్పచెప్పేస్తారు ఆరుద్ర.

స్థూలంగా కథావస్తువులు చాలా సాధారణవిషయాలు–పిల్లల ఆటపాటలు, వాళ్లప్రవృత్తులూ, మధ్యతరగతి యువత ప్రేమలూ, కాబోయి ఆగిపోయిన పెళ్లిళ్లూ (అన్నిట్లోనూ కటికనిజాలు), తల్లుల తాపత్రయాలూ, డబ్బు బాధలు, ఈతిబాధలూ, కటికదరిద్రంలాటివే. కాని వాటిని తీసుకుని మరొక జీవనసత్యాన్ని ఆవిష్కరిస్తాడు ప్రతిభగల రచయిత. ఆరుద్ర చేస్తారు అలా.

ఇ.యం. ఫార్స్టర్ కాబోలు అన్నాడు మొత్తంసాహిత్యంలో ఇతివృత్తాలన్నిటినీ ఓపుంజికి కుదించేయవచ్చని. స్థూలంగా చూస్తే - అయితే ఆడదీ కాపోతే డబ్బు - లోకంలో అన్నిబాధలకీ ఈరెండే మూలకారణం. ఇంకా కాస్త పరీక్షగా చూస్తే, ఒక మనిషి మరో మనిషిమీద తన ఆధిక్యం ప్రదర్శించుకోడానకి పడే అవస్థలు, అంతరాంతరాల ఏమూలో నక్కి నసపెడుతున్న అహంకారం (ఈగో) అనిపిస్తుంది. ఇది ప్రాతిపదికగా తన ఆధిక్యాన్ని ప్రదర్శించుకోడానకి ద్రవ్యమో ఎదుట మరోమనిషో కావాలి. అక్కడ మొదలవుతుంది ఏకథయినా.

ఈసంకలనంలో పిల్లలమనస్తత్త్వాలని చిత్రించేవిః ″ఊష్ణమొస్తే బాగుణ్ణు″ మొదటిది. అలా ఓ చిన్నవాడు ఊష్ణమొస్తే బాగుణ్ణు అని కోరుకోడానికి కారణం అన్నకి ఊష్ణమొచ్చినప్పుడు జరిగిన ఉపచారాలు. చదివి చెమర్చని కళ్లుండవేమో అన్నంత సహజంగా చిత్రిస్తాడు పిల్లలమనస్తత్త్వాలని కథకుడు.

″పిల్లికూన″లో పిల్లిపిల్లకీ దాన్ని చేరదీసిన చిన్నవాడికీ మధ్య పెరిగిన అనుబంధం. పిల్లికూనమీద పిల్లవాడికి మమకారం ఏర్పడడంలో విశేషం లేదు. కాని ఆపిల్లికూనచేత సర్కస్ ఫీట్లు చేయించాలన్న కోరిక వాడికి ఎందుకు కలిగింది? ఎందుకంటే సాటి సావాసగాళ్లలో తన ప్రత్యేకత నిరూపించుకోడానికి. పారిపోయిన పిల్లికూనకోసం పిల్లాడు బాధపడతాడు కాని ఎందుకు పారిపోయిందో అర్థం కాదు ఆచిన్నబుర్రకి. పెద్దవాళ్లలో ఎంతమంది లేరు ఎదటిమనిషిని నొప్పిస్తున్నాం అని గ్రహించలేనివాళ్లు!

పిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా ఆర్థకసంబంధమయిన భావజాలం ద్యోతకమవుతుంది సుళువుగానే. పెద్దలు కాల్చిపారేసినసిగరెట్టు పెట్టెలకి వెలకట్టి, తన ఆధిక్యతని చూపుకుంటాడో కుర్రాడు. వాడిమీద మిగిలిన పిల్లలు ధ్యజమెత్తుతారు ″ముప్ఫైలక్షల పందెం″ అన్నకథలో. .కథ సిగరెట్టుపెట్టెలఆట. అమెరికాలో బేస్‌బాల్ కార్డులవిలువలాటిదే ఆరోజుల్లో మనదేశంలో పిల్లలకి పెద్దలు కాల్చి పారేసిన ఖాళీ సిగరెట్‌ పెట్టెలు. వాటికి పిల్లలు ఆర్థికవిలువనాపాదించి తాండ్రబెత్తు (చిన్న చదరపు పలకరాయి) తో ఆడేఆట, ఆ ఆట ఆడుతున్నప్పుడు పిల్లలు ప్రదర్శించే తెలివితేటలు చూసితీరాలి. లేకపోతే ఆరుద్రకథలో చదివితీరాలి.

అలాగే ″భోగిపిడకలు″ కథలో పిల్లల ఆర్థికశాస్త్రం తమకి అనువైన రీతిలో వాడుకోడం కనిపిస్తుంది. చిన్నతనంలోనే పిల్లలకి ఆర్థికబాధ్యత తెలియజేయాలనుకున్న కథకుడు మర్చిపోయిన, అంతకంటె ముఖ్యమైన విషయం చివరలో మనకి ఆశ్చర్యం కలిగించదు. అవునుసుమా నిజమే అనిపిస్తుంది మనచేత.

″పిచ్చుకగూళ్లు″ మరో పిల్లలకథ. పలకపుల్లలదగ్గిరునించీ, దరగాకొండా, పిల్లలపాటలూ, ఆటలూ ఆరుద్ర ఈకథలో ఎంతచక్కగా పొదిగారంటే అయ్యో ఆలాటిరోజులు వుండేవి అని మర్చిపోయినందుకు నామీద నాకే జాలేసింది. ముఖ్యంగా విశాఖపట్నంరోజులు. ఆకాశపు చల్దికుండ, వెన్నెలతరవాణిలో ఉన్నదొక్కటే పిడచ అంటూ మళ్లీ పాడుకోవాలనిపించింది.

దారిద్ర్యంవల్ల తాను కోరిన సకుమారితో పెళ్లికాకపోవడానికీ డబ్బో, తనకంటె మరింత కలేజా వున్నమగవాడో కారణం. అబ్బాయీ, అమ్మాయీ, పెళ్లి, లేక పెళ్లికి దారితీయగల ప్రేమా, భగ్నప్రేమా - అనాదిగా వస్తున్న కథాంశాలే. అయితే ప్రతిసారి మరో కొత్తకోణం చూపుతారు రచయితలు. లేదా కొత్తభాషాప్రయోగాలు చేసి పాఠకుల మన్ననలందుకుంటారు. కదాచితుగా పాఠకులమేధకి మేత పెడతారు. వారిని ఛాలెంజి చేస్తారు. ఈరెండోకోవలోకి వస్తుంది ″చాపకింద నీరు″ అన్నకథ. వాచ్యం కాని వివరాలమూలాన చదువరిమెదడుకి పుష్కలంగా పని పెడుతుందీ కథ. రెండుసార్లు చదివినా చివర కథకుడు ఏం తేల్చి చెప్పాడో నాకు తెలీలేదు. అంచేత ఆకథ నాకు నచ్చలేదు అని చెప్పలేను కూడా. ఎందుకంటే కథ నడిచినతీరు నన్ను నడిపించింది.

″వూరు వూరుకొంది″లో నిరుద్యోగి కథానాయకుడు ″రోడ్డుపట్టేడు. … తాను తొడుక్కున్న నిరాశచొక్కా విప్పిపారేశాడు. … ఆచొక్కాజేబుల్లో వున్న ఆశా, ఆశయం రెంటీనీ మాత్రం తీసుకుని బయల్దేరాడు…″ ఇలాసాగుతుంది కథ. చివరకి అతడు జననమరణరిజిష్ట్రారు ఆఫీసులో తేల్తాడు.. రచయిత ఎత్తిచూపేది ఆయువకుడి నిరాశని కాదు, దానినధిగమించగలిగిన అతడి ఆత్మబలాన్ని.

అలాగే చిత్రమైన వాక్యాలతో కూర్చినకథ, ″మసాబు వెలుతురు″. ఈకథలో ″మీటనొక్కితే దీపం వెలుగుతుంది అన్న సంగతి మూడుగంటలకే గుర్తుంచుకొంటే ఇంత చీకటిగా ఉండకపోను అన్నసంగతి ఏడుగంటలకి తట్టింది రామారావుకి.″ వాక్యాలలో చమత్కారం ఒక్కటే కాదు మనకి సాక్షాత్కరించేది. అనుదినం, క్షణక్షణం ఎన్ని చిన్నవిషయాలు ఎంత అమాయకంగా మనకళ్లముందే వుండి కంటికి ఆనకుండా పోతాయో వెల్లడి చేస్తాయి.

″నిశానీలు″ పేరుకి తగ్గట్టుగానే కథంతా నిశానీల (వాచీ, జోళ్లూ, కళ్లజోడు) ద్వారా చెప్పించినా, ″వూరు వూరుకొంది″లోలాగ మరో మధ్యతరగతి యువకుడికథ. ″చేబదులుకోసం″ సంభాషణలలో చెప్పినకథ. ఇందులో విశేషం అదే. ప్రత్యేకించి సంఘటన అంటూ ఏమీ లేదు. పాత్రలని పాఠకులు ఊహించుకోవాలి సంభాషణలనిబట్టి అంతేకాని పాత్రచిత్రణపేరుతో అరపేజీ వర్ణనలుండవు. పాఠకులే సంభాషణలు చదువుతూ (మనసులో వింటూ) ఎవరు ఎవరో, సుమారుగా ఎలా వుంటారో గ్రహిస్తారు. గ్రహించగలరు. అది రచయిత సాధించిన విజయం.

″స్వర్గాదపి″లో కథానాయకుడు వూళ్లో జరుగుబాటు లేక, వూరు వదిలి వెళ్లిపోయి, మళ్లీ తిరిగివచ్చినప్పుడు గతాన్ని తలబోసుకున్న స్వగతమే కథ. తిరిగివచ్చింతరవాత తనని గుర్తించింది ఆనాటి జోన్ పాల్ ఒక్కతే. ఈకథ ఆరుద్రకథల్లో కాస్త వాసి తగ్గినకథ అనిపించింది నాకు. ముగింపు గ్రహించడానికి అట్టేసేపు పట్టకపోవడంచేతనేమో.

″తల్లి వూఁ అంది″ కథలో కథానాయకి వినా ఆంగ్లో ఇండియను అమ్మాయి. శరీరం అమ్ముకుని భుక్తి జరుపుకుంటున్న యువతి. చివర కథకుడు అంటాడు, ″నాకు ఈకథ చెప్పిందికి చాలా విచారం వేస్తున్నది… వినా బతుకుతున్నది. అందుకు తల్లి వూఁ అన్నది″ అంటారు. ఇంతటి నిరాడంబరమైనభాషలో అంతటి విషాదాన్ని నింపడం ఆరుద్రలాటి కొద్దిమందే చెయ్యగలరు. సహృదయుడయిన కథకుడు కథలో లీనమయిపోతాడు. ఆకథ రాస్తున్నంతసేపూ అతడికి ఆపాత్రలు నిజం, ఆసంఘటనలు నిజం. సాహిత్యంలో ఉదాత్తత అంటే ఇదే.

″ఇందలి నీతి: చెడలేదు″ అన్నకథలో సుబ్బారావుకోసం ఎదురుచూస్తున్న సీత వేదన ఎంతసేపు అంటే ″సుబ్బారావున్నరగంటలసేపు″. అది ఆరుద్రమార్కు వాక్యవిన్నాణం అని అర్థం కావడానికి అరపేజీ చదివితే చాలు. అయితే ఇది మాటలగారడీ కాదు. హాస్యకథ కాదు. సుబ్బారావుని నమ్మి తనని తాను అర్పించుకున్న సీతకి కాలమానం కొలమానం, ఆపైన ఆమె జీవనహేల అంతా ″సుబ్బారావు″లెక్కల్లోనే-గా మారిపోతుంది. సీత తనచుట్టూ సుబ్బారావుని అల్లుకుంది. ఆసుబ్బారావులో చిక్కుకున్నసీతకి సుబ్బారావుకి మించినలోకం లేదు. సీత సీతకి ఏం జవాబు చెప్పుకుందో, సీత సీతచేత ఏంచేయించిందో నేనిక్కడ చెప్పలేను. ″ఇకమీదట సుబ్బారావుకి సీతం పావుగంటలుండవు″ అంటాడు కథకుడు. ఇలాటి వాక్యాలలో కేవలం చమత్కారమే కాక ఒకతరహా మనస్తత్త్వం కూడా స్ఫురిస్తుంది.

నాకు సైకోఎనాలిసిస్ తెలీదు, ఏప్రముఖసైకో పుస్తకాలూ చదవలేదు కానీ నాకు తోచినది -ఒక పెద్దదెబ్బ తగిలినప్పుడు కలిగిన నొప్పిని తట్టుకోడానకి మనిషి తననుంచి తాను వేరు చేసుకుని, ఆనొప్పిననుభవిస్తున్న వ్యక్తి వేరే వున్నట్టూ, తాను ప్రేక్షకుడయినట్టూ ఒకవాతావరణం సృష్టించుకుంటాడు. అలాటి దృక్పథంతో ఈరెండు పాత్రలు చిత్రించబడినవేమోనని నేను అనుకుంటున్నాను.
పైకథ ప్రధమపురుషలో సాగితే, ″కడసారి″ అన్నకథ స్వగతంలో సాగుతుంది. రెంటిలోనూ న్యాయం, లేదా జరిగిన అన్యాయం ఒకటే. అయితే రెండుకథలు ఎందుకు రాసేరు అంటే రెండు కోణాల్లోంచి చూడమని చెప్పడానికి అని చెప్పుకోవలిసి వస్తుంది.

″స్వప్నవాస్తవదత్త″లో కూడా తాను కలగన్న చిన్నది తనకి కాకుండా పోయినవైనం. కథానాయకుడు సుబ్బారావుకి సీత ″ఇచ్చిన వాస్తవం″ ముగింపు. సుబ్బారావు పరివర్తన నిరాశలోంచి ఆశలోకి, నిరుత్సాహంలోనించి ఉత్సాహంలోకీ, దరిమిలా లోకంలోకి అడుగుపెట్టడం కథాంశం. బురదలోపడ్డ సుబ్బారావు ″బురదచొక్కాతోపాటు తన నిరాశనీ, నిస్పృహనీ విసిరిపారేసి″ హుషారుగా లోకంలోకి అడుగుపెడతాడు. అంతే కథ. చెప్పినతీరు మనల్ని మెప్పిస్తుంది.
ఈరెండు కథల్లోనూ, ″ఇందలినీతిః చెడలేదు″, ″స్వప్నవాస్తవదత్త″లోనూ పాత్ర పేర్లు ఒకటే అయినా రెండూ వేరు వేరు కథలు. రచయిత ఈపేర్లు వాడడానికి కారణం సగటుమనుషులజీవితాలన్నీ ఒక్కలాగే వుంటాయని చెప్పడానకేమో.

″దీవెన″ పెద్దకథ ఈసంకలనంలో. ఆరుద్ర పెళ్లిలో చదివేమంత్రాలూ, ఆపెళ్లిలో పెళ్లికొడుకు తనకొడుకే కానందుకు విచారిస్తున్న తల్లి వేదనా వివరిస్తూ–జోడుగుర్రాలస్వారీలా కథ సాగి ఆర్ద్రంగా ముగుస్తుంది. కథచివరలో తల్లి పరివర్తన అద్భుతంగా చిత్రించారు. నాకు బాగా నచ్చినకథల్లో ఇదొకటి.

చారిత్ర్యాకాంశంతో నేపథ్యంలో సాగినకథ ″రాజముద్రిక″. - .చోళ పాండ్యరాజుల మధ్య వివాదం, నాగమనాయనివారి తీర్పు.. వస్తువుకి తగ్గట్టే రచయిత భాష కనక ఇది చదువుతున్నప్పుడు మనం కూడా ప్రస్తుతం వదిలి గతంలోకి తొంగిచూస్తాం.
ఇందులో ముఖ్యపాత్రలు పాండ్య, చోళ, నాయకరాజులు, నాగమనాయనివారి (నాయకరాజు) సహాయంకోసం వచ్చిన పాండ్య, చోళరాజులని తనచమత్కారంతో గెలుచుకున్న కథ. అయితే నిజమైన చతురత నాగమనాయనివారిది కూడా కాదు. మరో చిన్నమలుపు.
అలాగే మరో పాతకాలం కథ ″పరిశిష్టం″. మరీ అంతవెనక్కి వెళ్లకపోయినా, ఇప్పుడు మనకి పాతకాలం కిందే లెక్క.. అందులో నట్టువరాలు, నాయకురాలూవంటి పాత్రలు - పెళ్లికిముందు పెళ్లికొడుక్కి నేర్పే పాఠాలు, తాతయ్యమురిపాలూ… సాంప్రదాయకరీతులకి నివాళి పడతాయి. అయితే ఆరుద్ర మరీ అంత సాంప్రదాయవాది కారు. అందుకేనేమో ముగింపు స్పష్టం చెయ్యలేదు. పూర్వసాంప్రదాయంలో పెళ్లికిముందూ పెళ్లిలోనూ నట్టువరాలికి ప్రాధాన్యం వుండేది. పెళ్లి అనుభవాల కిటుకులు తాతయ్యలు కుర్రకారుకి చెప్పేరోజులుండేవి (మల్లాది వారు గుర్తొస్తారు కొందరికైనా). వెనకటిసాంప్రదాయంలో., ఆసాంప్రదాయాలు తెలుసుకోడానికి ఈకథ ఉపకరిస్తుంది.

″చింతచిగురు″లో లేమి. మనసుని పట్టి వూపేసేకథ. ఎముకలగూడులా కొనవూపిరితో కొట్టుకులాడుతున్న జీవుడిని నిలుపుకోడానికి తిండి కావాలి. అది ఆఖరికి చింతచిగురయినా ఘనమే. రెండు అస్థిపంజరాలకథ. వాళ్ల అస్తిత్వం ఎంత నాస్తిత్వమో చెప్పడానికి ఆరుద్ర వాడిన క్రియాపదాలు చూడండి. ″ఆకలిరంగు చర్మాల్లో రెండెముకలగూళ్లు నిర్ఝనమైన మాడుతున్న రోడ్డుమీద వారంట తూలుతూ నడుస్తున్నాయి. … ఎముకలగూళ్లు ఎక్కడినుంచి ఎక్కడికి ఎందుకు ప్రయాణం చేస్తున్నాయో …″ కాకివాలితే, రాలిన చింతచొట్టతో ఎండిపోయిననోటికి కలిగిన వూరట ఎంత. అది కూడా తగినంత రాదు. మొగాడు మొహంతిరిగి పడితే సీసాలో నీళ్లతో అతనిమొహంమీద చల్లబోతే, వద్దని ఆఆడమనిషినే తాగమంటాడు. ఒకచిన్నకథతో ఎంతచిక్కని కథ అల్లొచ్చో చదివితే తెలుస్తుంది.

ప్రతి ఒక్కకథలోనూ ఆరుద్రమార్కు వాక్యాలు అడుగడుగునా ఎదురై పాఠకులదృష్టిని ఓకతాటిన నడిపిస్తాయి. నామటుకు నాకు ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఏకథ అయినా చదవాలనిపించినప్పుడే పూర్తిగా చదువుతాం. అలా అనిపించడానికి వాక్యనిర్మాణం అతిముఖ్యమైన సాధకం (లేక అనుపానం అనాలా?). సుబ్బారావున్నరగంటలసేపు- లాటి వాక్యాలు నన్ను ఆకట్టుకుంటాయి.

″మానవత్వం″ కథలో సైనికుడు కక్కని చంపబోయేముందు తనలో కలిగిన మానసికాందోళనకి అక్షరరూపం. ఈకథకి రెండోవైపు అనిపించే కథ ″చాపకిందనీరు.″ నలభైయేళ్ల అప్పలస్వామి ″వెయ్యిన్నర గాలివానలు చూసిన బిళ్లబంట్రోతు.″ అతనికీ మెజిస్ట్రీట్ కామరాజుకీ మధ్య నడిచినకథలో కథకుడు స్పష్టంగా సూటిగా చెప్పనివి వున్నాయి. ఓకథ చదివి ఏంజరిగింది, ఏంజరిగివుంటుంది, కథకుడు ఏం చెప్పాలనుకున్నాడులాటి ప్రశ్నలు వేసుకోడం సరదాగల పాఠకులకి ఇది సవాలు.

ఈసంకలనంలో ఇక్కడ కథేముంది అనిపించేది ″నే చెప్పాగా!″ అన్నది. మనం నిత్యజీవితంలో వాడే వూతపదాలని వుపయోగించుకునే తీరు హాస్యంస్ఫోరకంగా, వ్యంగ్యంగా ఆవిష్కరించారు రచయిత.

మంచికథలలక్షణం ఏమిటీ అంటే పాఠకులచేత చదివించేదిగా వుండాలీ, ఆలోచింపజేసేదిగా వుండాలీ అఁటారు.
కథ ″చదివింపజేయగలగడం″ అన్నది విస్తృతార్థంలో పాఠకుడు మనసుపెట్టి, కళ్లు పెట్టి ప్రమత్తతతో చదవితేనే జరుగుతుంది. ఉదాహరణకి శీర్షికలు చూడండి. ″ఇందలినీతిః చెడలేదు″. నేను మొదటిసారి కోలన్ గమనించలేదు. ఆకోలన్ తీసేస్తే వేరే అర్థం వస్తుంది కదా. అలాగే ″స్వప్నవాస్తవదత్త″ కూడా మొదటిసారి స్వప్నవాసవదత్త అనే చదివేను. వాసవకీ వాస్తవకీ ఎంత తేడా!

ఇక పోతే, ″ఆలోచింపజేయడం″ ఎలాటిది అన్న విషయంలో ఈనాడు అభిప్రాయబేధాలున్నాయి. వెనకటి రోజుల్లో ఆలోచింపజేయడం అంటే ఏమిటో ఈకథలు చదివితే తెలుస్తుంది. నేను వేరే వివరణ ఇవ్వక్కర్లేదు.
అందుకు భిన్నంగా, ఈరోజుల్లో ఆలోచింపజేయడం అంటే కథలో స్పష్టత, ప్రతిచిన్నవిషయాన్ని వివరించి చెప్పడం, వాచ్యం చెయ్యడం అని అనిపిస్తోంది. ఆదృష్టితో చూస్తే, ఈకథల్లో రచయిత స్పష్టం చెయ్యనివి, వాచ్యం చెయ్యనివి అనేకం కనిపిస్తాయి. ముగింపులో తాడో పేడో తేల్చయ్యరు ఆరుద్ర. ప్రతికథకీ రెడీమేడ్ పరిష్కారం ఇవ్వరు. ″నేను చెప్పగలిగింది, చెప్పదల్చుకున్నది చెప్పేను, ఇంక మీరు ఆలోచించుకోండి″ అని చెప్పకయే చెప్తారు.

అందుకే ″ఊష్ణమొస్తే బాగుణ్ణు″ లాటికథల్లో చావుని సూచనప్రాయంగానే వదిలివేయడం జరిగింది. (రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి ఇద్దరు పిల్లలు కథలో కూడా ఇంతే). కుర్రవాడు చనిపోయాడనో మరణించాడనో కాక, ఆసందర్భంలో ఇతరపాత్రలు ఆసంఘటనకి ఎలా స్పందించారో, ఆకష్టాన్ని ఎలా ఎదుర్కొన్నారో చెప్పడంద్వారా మనకి విశదం చేస్తారు.

నేను చెప్పగలిగింది ఇఁతే. మీరు చదివి తెలుసుకోవాలి నిజమైన ఆరుద్రకథలలో సౌందర్యాలు.

(© మాలతి .ని. ఏప్రిల్ 2008.)

నిజానకీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ
ఈరెండుకథలకీ ముందుమాట

చాలా పత్రికలూ సంకలనాలూ నన్నడక్కుండానే ప్రచురించుకున్న ప్రముఖకథ ఇది.
ఈకథమీద చాలా చర్చలు జరిగాయని విన్నాను. అంచేత అవే ప్రశ్నలు మళ్లీ మళ్లీ తలెత్తకుండా, నేను ఈకథగురించి నామాట ముందే చెప్పేస్తాను.
నాకు వ్యక్తిగతంగా కూడా వుత్తరాలు వచ్చేయి. అందులో చాలావరకూ తమజీవితంలోనూ తమఆప్తులజీవతంలో సరిగ్గా ఇలాగే జరిగిందనీ, తమకి కాస్త ఓదార్పు కలిగించిందనీ.. ఏకథకి అయినా అదే ప్రయోజనం. సాధారణంగా కథకోసం వస్తువు గ్రహించినప్పుడు రచయిత సంఘటనని కొంత ఆసరాగా తీసుకుని కథ రాసినప్పుడు దానికి విశ్వజనీనత వచ్చేది అలాటిఅనుభవమో సంఘటనో ఇతరుల జీవితాల్లో కూడా జరిగినప్పుడు, అనేకసంఘటనలని కూడదీసి ఒకకథ అల్లినప్పుడు. కథకీ ఆత్మకథకీ తేడా అదే.
మొదటికథమీద చర్చలు చాలానే జరిగినా, నాదాకా వచ్చిందీ, నాకు సమాధానం చెప్పాలనిపించిందీ రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్య. ″… ఇలా సీత ఆత్మవంచన చేసుకుంటూ కొంతకాలం గడిపి …″ అన్నది.
నేను ఈకథలో సీతపాత్ర ఆత్మవిశ్వాసం గలవ్యక్తిగా చిత్రించడానికి ప్రయత్నించాను. (పత్రికలవారు నెత్తిన కొంగు వేసుకుని పెద్ద కన్నీటిబొట్టుతో సీతని చిత్రించడం కూడా నాకు నచ్చలేదు). పోతే ఆత్మవంచన అన్నది ఒక దుస్థితిలో వుండీ ″నేను సంతోషంగా వున్నాను, నాజీవితం పూలనావ″ అన్న భ్రమలో వున్నవ్యక్తికి నప్పుతుంది. అంతేకానీ, సమస్య వుందని గుర్తించి, ఆసమస్యకి మూలకారణం వెతుక్కుని, ఎదుటివ్యక్తిని ముఖాముఖి ఎదుర్కొని నిలదీసి ప్రశ్నించి, పరిష్కారంగా తనకు తానుగా నిర్ణయం తీసుకున్న వ్యక్తికి నప్పదు. దాన్ని ″ఆత్మవంచన″ అనడం అసమంజసం. ఇక్కడ రంగనాయకమ్మ నాకిచ్చిన కితాబుకూడా చెప్పుకుని గొప్పపడిపోవాలి మరి. తాను నాకథలో ఒకవాక్యం తీసుకుని, కాస్త మార్చి (″మీప్రేయసులలో ఒకప్రేయసిగా వుండను″) వాడుకున్నాను అంది. అది వారి ఔదార్యం!

రెండో ప్రశ్న. దీనిలో ఫెమినిజం ఏముంది అన్నది. లేదు. ఇది ఫెమినిజం కాదు. ఫెమినిజం పేరు చాటు పెట్టుకుని, అటు ఫెమినిజానికీ ఇటు నిజానికీ చెందని, కళ్లుమూసుకు పాలు తాగేపిల్లి తత్వం ఎత్తి చూపాను ఈకథలో. అలాటివారిలో చిత్తశుద్ధి లోపించిందన్న వాదన ఇది. ఇంట్లో భార్యకొక నీతీ, ఊళ్లో ఆడవాళ్లకి మరో నీతీ మగవారిలోనూ, ఆమగవారిప్రాపకంలోనే తమస్థాయిని పెంచుకోడానికి నానా రూపులూ ధరించే ఆడవారినీతినీ ప్రశ్నిస్తున్న కథ ఇది. సోకాల్డ్ సంఘసంస్కర్తల చిత్తశుద్ధిని నిలవేసి ప్రశ్నిస్తున్న మేలుకొలుపుపాట.
మూడోకోణం. అది ప్రవాసజీవితంలోని కొత్తవిలువలకి అలవాటు పడలేక, పాతవిలువల్ని వదులుకోలేక ఆరాటపడిపోతున్న అస్తవ్యస్తపు జీవులు తెలిసీ తెలియకా పడే బాధలు. నిజానికీ ఫెమినిజానికీ మధ్య రాసింతరవాత, ఈవిషయం పూర్తిగా ఆవిష్కృతం కాలేదనిపించి, ఆతరవాత రాసిన కథ దేవీపూజ. కాలక్రమంలో వెనకే అయినా ముందు చదివితే మొదటికథ (నిజానికి … ) ఎక్కువగా అర్థమవుతుందనుకుంటాను. నాకథల్లో పాత్రలు ఆరోజుల్లో, అంటే 60, 70 దశకాల్లో, ఆంధ్రలోనే వుంటే వారికథ వేరే విధంగా వుండేదనే నాఅభిప్రాయం.

మరొక సంగతి. ఈపరిస్థితులు కొంతవరకూ 80 దశకంనాటికే మారిపోయాయి. అంచేత ఈతరంవారికి ఇది అంతగా అర్థం కాకపోవచ్చు కూడా. అందుకే రెండు కథలూ ఇక్కడ పెడుతున్నాను. ఈకోణాల్లోంచి, ఈవరసలో చదివి మీఅభిప్రాయాలు రాయండి.

(మాలతి, ఏప్రిల్ 200 8)

దేవీపూజ

నిజానికీ ఫెమినిజానికీ మధ్య

జీవాతువు

జమాఖర్చుల పట్టిక

jamakharcula1

మిత్రులు రాజేంద్రగారి సలహాననుసరించి, స్కాన్ చేసిన ఒక పాతకథ ఇక్కడ పెడుతున్నాను. నాదగ్గర అన్నీలేవు, వున్నవి కూడా ఇలా శిధిలావస్థలో వున్నాయి ఓసారి వరదలొచ్చి.

నయనానందకరంగా లేకపోయినా, 1982నాటి, చెణుకులూ, ప్రకటనలూ కూడా చూస్తారని పెట్టేను, మీకు ఎలా వుందో చెప్పండి.