పూర్వకవులు -వెంగమాంబ (2 భాగం)
మార్చి 13, 2008 ద్వారా tethulika
పూర్వకవులు -వెంగమాంబ (తరువాయిభాగం)
(ఎన్నెం కతలు)
మొదటి వ్యాసం రాసినతరవాత, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు రాసిన సరస్వతీ సామ్రాజ్యవైభవము రూపకం నాకు కనిపించింది. బెజవాడ గోపాలరెఢ్డిగారి కోరికపై ఆంధ్రరచయిత్రుల ప్రజ్ఞాపాటవాలు లోకులకు తెల్లం చేసే ఉద్దేశ్యంతో రాసినరూపకమని ముందుమాటలో చెప్పారు ఆమె. తొమ్మదిమంది ప్రముఖకవయిత్రులని ఒకచోట చేర్చి, వారి కావ్యాలలో ప్రాచుర్యం పొందినపద్యాలను ఉటంకిస్తూ, సూత్రధారుడు, కలభాషిణివంటి సముచితపాత్రలతో రసవత్తరంగా నడిపిన రూపకం ఇది.
అందులో వెంగమాంబరచనలుగా ఉదహరించిన రెండు పద్యాలు ఇక్కడ చేరుస్తున్నాను. మొదటిది వెంగమాంబగారు రచించిన వేంకటేశ్వరమహాత్మ్యంలోనిది. సున్నితమైన చమత్కారం, మనోహరమైన భాష చూస్తాం ఇక్కడ. వరాహావతారంలో తాను లక్ష్మి ఎదుటపడలేను అంటాడుట విష్ణుమూర్తి!
ధారుణి నీటన్ మునిగిన
కారణమున దాని నెత్తు కార్యంబున నీ
ఘోరాకారము దాల్చితి
నా రూపము చూచి లచ్చినగదె ఖగేంద్రా!
ఆ వైకుంఠ పురమ్మున
కేవిధమున వత్తు లక్ష్మి యెక సక్కెముగా
నీ వెవ్వడనుచు నడిగిన
శ్రీవిష్టుండనగ నాకు సిగ్గగు గరుడా!
రెండో పద్యం లక్ష్మీకాంతమ్మగారి కూర్పు కావచ్చు. లక్ష్మీకాంతమ్మగారు గాంధీ అనుయాయి. ఈపద్యంలో గాంధీ ప్రసక్తి వుంది. వెంగమాంబనాటికి గాంధీగారు లేరు కదా.
బహుళార్థసాధక బ్రహ్మాండ భాండంబు
పాలనా స్థితి సల్పు ప్రభుడెవండు
దివ్య వక్షమ్మునా దేవికి నిచ్చి
మహిళ కున్నతి గూర్చు మహితుడెవడు
శ్రీరామ కృష్ణాది చిన్మూర్తి తానయి
ధర్మోద్ధరణ సల్పె ధరణి నెవడు
దుష్టశక్తుల మాపి దురితమ్ము తొలగింప
గీత బోధించు సుకృతి యెవండు
శాంతిని, నహింస, ప్రేమను, సత్య నిష్ఠ
భువి, నిలువ గాంధి యౌ మాహాత్ముడెవడు
అట్టి శ్రీ వేంకటేశు సమర్చ జేసి
భక్తి తరియింపరే కలి ప్రజలు మీరు!
(మార్చి 200 ![]()
ఆహా!
విష్ణుమూర్తి సిగ్గుపడటం భలేవుందండి. అదిన్నీ గరుత్మంతునితో చెప్పుకొని! ఎప్పుడూ వినలేదు. చక్కగా కందపద్యాల్లో!!
తరువాత లక్ష్మీకాంతమ్మగారి సీసపద్యం చదివాక, ఇటీవల నాకు కలిగిన ఒక సందేహాన్ని మీ ముందుంచుతున్నాను - సుకృతి అనే పదంలో సు గురువౌతుందా లఘువేనా? (కృ లోని) సుడిని లఘువుగా గుర్తించే సందర్బాలున్నాయా? - ఈ పద్యంలో అది గురువైనా లఘువైనా గణాలకొచ్చే యబ్బందేమీ లేదు గనక స్వప్రయత్నముతో నా సందేహం తీరలేదు.
అయ్యయ్యొ, నాకంతటి పాండిత్యం లేదండీ.
మీరన్నట్టు విష్ణుమూర్తి సిగ్గుపడడం -లాటి చమత్కారాలు నాకు చాలా ఇష్టం. అంచేత అలాటివి పోగుచేస్తుంటాను. పైన వుదహరించిన పద్యం ఆపుస్తకంలో వున్నదున్నట్టు ఇక్కడ దింపేశాను.
మరొకసంగతి హైందవసాంప్రదాయంలో దేవుళ్లకి మానవనైజాన్ని ఎంతచక్కగా ఆపాదించుకుంటామో కూడా తెలుస్తుంది వీటివల్ల.
మనబ్లాగరులలో పండితులున్నారు కనక వారెవరైనా జవాబు చెప్తే నేను కూడా తెలుసుకుని ఆనందిస్తాను.