ఆచంట శారదాదేవిగారు పరిణతి చెందిన రచయిత్రి. ఆమెకథల్లో మానవీయకోణాలు ఎంతో సూక్ష్మదృష్టితో పరిశీలించడం గమనిస్తాం. ఆమెకథల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఈకథని చాలామంది విమర్శకులు కేవలం స్త్రీజీవితాన్ని పంజరంలో చిలుకతో పోల్చడమే చూశారు. నాకు మాత్రం ఈకథలో అంతకంటె ఎక్కువగా భార్యాభర్తలమధ్య లోపించిన సామరస్యం కనిపించింది.
మరి మీకు ఇందులో ప్రత్యేకంగా కనిపించిన అంశాలు ఏమిటి?
శారదాదేవిగారి రచనలమీద నావ్యాసం రెండు భాగాలు
అలాగే పి. సత్యవతిగారి బ్లాగులో వారి వ్యాసం http://satyavathi-p.blogspot.com/2010/09/blog-post.html చూడండి.
ఆచంట శారదాదేవి గారు ఈ కథని చాలా చక్కగా వ్రాశారు.ఇంట్లో వున్న ఇద్దరు ప్రాణుల మథ్య communication లేకపోవటంలోని విషాదం,రొటీన్ జీవితంలోని వేసట, ఏమాత్రం మాట కలపని భర్తతోనే ఏదో ఒకటి మాట్లాడడం,అందులోనే ప్రకృతి పరిశీలనలో కొంత ఊరట..అలాంటి నిదురించే తోటలోకి వచ్చిన పాటలాగా చిన్నారి చిలుక వచ్చింది.కొంతకాలం మురిపించి మాయమైంది,ఒక జీవన సత్యాన్ని అర్థం చేయించింది.స్వేచ్చలోనే ఆనందం వుందని,.ఒకరకంగా తనూ పంజరంలో చిలకే.అందువల్లే చిలకని మళ్ళీ బంధింఛి పంజరంలో పెట్టొద్దని చెప్పింది.అంతవరకూ బాగుంది కానీ “వృధా మమకారం “అనే వ్యాఖ్య అక్కడ అనవసరం అనిపిస్తుంది..
ఆమె చిలుక మీద మమకారం పెంచుకున్నది కనక – నిజమే అనుకోండి. కానీ స్వేచ్ఛనిగురించిన అవగాహన వచ్చినతరవాత మళ్ళీ మమకారం వృథా అని విచారించడం జరుగుతుందా అని అనుకుంటా శారద అడుగుతున్నది. నాకు అది నిజమే అనిపిస్తోంది. అంటే ఒకవిషయానికి నేపథ్యం తెలిసినతరవాత కూడా ఇంకా విచారించడం జరుగుతుందా అని అనుకుంటున్నా
మాలతి గారూ,
కథ మళ్ళీ చదివాను. మళ్ళీ బాగా అనిపించింది.
“వృథా మమకారం” ఎందుకంటే, ఆమె చిలుక మీద మమకారం పెంచుకున్నది, చిలుక మాత్రం ఎగిరిపోవాలనే చూసింది కదా, అని నాకనిపిస్తోంది. మనది అనుకుని ఒక దాన్ని బంధించి మనం వినోదించి దాని కష్టపెట్టి బాధ పడడం ఎందుకూ, వాటంతట అవే ఎగిరి వచ్చి వాలినప్పుడు అన్నీ మనవే కదా అని భావం అనిపించింది.
ఆమె పరిస్థితి వర్ణన అంతా, “వర్ణన” మాత్రమే అనుకుంటున్నాను, మనని ఆ దృశ్యంలోకి తీసుకు వెళ్ళడానికి. కథ మాత్రం ఆమె చిలుకని బంధించి ఆనందించడం నుంచీ అది ఎగిరిపోయినప్పుడు పడ్డ బాధ నుండీ తేరుకుని మళ్ళీ వచ్చి వాలినప్పుడు వాటితో పాటు వాటి స్వేచ్ఛనీ స్వాగతించడానికి సంబంధించి మాత్రమే అనిపించింది నాకైతే.
శారదా. చారిత్ర్యకంగా మీరు చెప్పినదే నేనూ అనుకుంటున్నాను. మనం మరొకటి కూడా గుర్తించాలి. కామాక్షమ్మ చదివింది ఎనిమిదో తరగతే అయినా భావుకురాలు అనిపిస్తుంది కథ ప్రారంభంలో మబ్బులగూర్చి ఆమె ఆలోచనలు చూస్తే. చిన్నతనంలో నగలమీద మాత్రమే ఆశ ఉన్నా, కాలక్రమాన, వయసుతో ఎదిగిన మనసు సాటిమనిషి ఆత్మీయతకోసం పరితపించడం చూస్తాం కదా కథలో.
మరొక పాఠకురాలు నాకిచ్చిన ఈమెయిలులో – తన భర్త తనతో చేసిందే తను చిలుకతో చేస్తున్నా అని ఆమెకి సందేహం కలుగలేదా? – అన్న వాక్యం కూడా నాకు నిజమే కదా అనిపించింది.
మీరన్న వృథామమకారం అన్నపదం కథలో ఇమడనిమాట నిజమే. మీరన్నతరవాత నాకు తోచిన ఆలోచన – నిజజీవితంలో మనకి జ్ఞానోదయం అయినా, వెనకటి బాధ అంత త్వరగా వదిలిపోదు అనేమో …
నాకు మరొక ఆలోచన కూడా వస్తోంది. అసలు స్వేచ్ఛ దేనినుండి? కామాక్షమ్మకి కావలసింది స్వేచ్ఛేనా, దేన్నించి స్వేచ్ఛ? మమతలు పెంచుకోడంమూలంగా వచ్చే బాధలనుండా, బాధ లేని మమకారాలు సాధ్యమా?
కామాక్షమ్మ చివరలో చిలుకలగుంపు చూసి ఆనందించింది. పారిపోయిన చిలుక ఆ గుంపులో ఉందో లేదో తెలీదు కానీ మొత్తంమీద గుంపులో కలిసిఉంటేనే ఆనందం అన్న సందేశం ఉందేమో ఇక్కడ!
- మీ వ్యాఖ్యలన్నీ చూసినతరవాత నాకు చాలా సందేహాలే వస్తున్నాయి. ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు. – మాలతి
ఈ కథ నాకు చాలా నచ్చిందండీ! మీరింతకు ముందొక సారి చెప్పినట్టు నేను రాసిన “అతిథి” కథ కూడా కొంచెం ఇలాగే వుంది, అయితే రెండిటి కాంటెక్స్టులూ వేరు.
నాకు కథలో అంతా కామాక్షమ్మ మానసిక పరిణామం (evolution?) లాగనిపించింది.
రెండు తరాల కింది స్త్రీలు జీవితం గురించి పెద్ద ప్రశ్నలేవీ పెట్టుకోలేదు (చాలా వరకు). జీవితాన్ని వున్నదున్నట్టు స్వీకరించి సర్దుకు పోయారు. ఆ తరువాతే స్త్రీలు కొంచెం “ఇది నాకు బాగా లేదు” అని అభిప్రాయం చెప్పటమూ, వాళ్ళ పరిస్థితులని గురించి ఆలోచించటమూ మొదలయిందేమో. ఒక పాతికేళ్ళ కిందటే స్త్రీలు వాళ్ళ సమస్యలగురించీ, పరిష్కారాల గురించీ క్రియా శీలకంగా ఆలోచించటం ప్రారంభమైంది. అందుకే నాకీ కథలో కామాక్షమ్మ ప్రవర్తనా, ఆలోచనా అంత అసహజంగా అనిపించలేదు.
నాకు ఈ కథలో ప్రొటాగొనిస్టు స్వేచ్చ విలువ గుర్తించటమే ముఖ్యమైన పాయింటనిపించింది.
అయితే ఒక చిన్న తిరకాసుంది.
ఆఖర్న ఆవిడ
“వృధా మమకారం” అన్నారు. అది చదివి నేను కొంచెం కంఫ్యూజ్ అయిన మాట నిజం. ఎందుకంటే, అవిడ చిలకని పంజరంలో బంధించకపోవటానికి కారణం చిలకల స్వేచ్చ మీద ప్రేమా లేక తన మనసు మీద ప్రేమా? మొదటి కారణమే నిజమైతే బాగుండునన్న ఆశ……
మంచి కథని పంచుకున్నందుకు ధన్యవాదాలు మాలతి గారూ!
శారద
@ లలితా, నిజమే. తను ఉన్న స్థితినుండి మారడానికి ఆమె ఏమీ ప్రయత్నం చేసినట్టు కనిపించదు. మీరన్న రెండో పాయింటు – తోటలోకి వచ్చి వాలే చిలుకలని చూసి ఆనందించే స్థాయికి ఎదిగింది – అన్నది నాకు తోచలేదు. నిజమే కదా. మనం పరిస్థితులు మార్చలేం అన్న స్పృహ కలిగినతరవాత ఉన్నదాంట్లోనే సంతృప్తిని సంతరించుకోడం కూడా గొప్పవిషయమే. అయ్యో నాకు లేదే అని ఏడుస్తూ కూర్చోక. మంచి కోణం ఎత్తి చూపారు.
అమ్మయ్య, ఈ సారి నా వ్యాఖ్యతో మొదలు కాలేదు
భాను గారితో మీ చర్చ నాకు ఉపయోగపడింది కూడాను.
ముందు చదివినప్పుడు చక్కగా కథలోకి తీసుకు పోయే కథనం బాగా అనిపించింది.
చివరంటా చదవించింది కథ.
ఆమె పరిస్థితి పంజరంలో చిలకతో పోల్చినట్లు అనిపించలేదు ఎక్కడా, నిజమే.
ఇంకొకటి, నాకూ భాను గారిలాంటి అనుమానమే వచ్చింది. ఈమె ఏ ప్రయత్నం చేసి ఉంటుంది, ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి? ఏమీ చెయ్యలేదా? అని.
అయితే ఆమె ఆ సమస్య గురించి చెప్పాలని అనుకున్నట్లనిపించలేదు ఈ కథలో. అందుకని ఆ ప్రశ్నలు వదిలేశాను.
వ్యాఖ్యలు చదివాక నాకు స్పష్టత ఏర్పడింది, నా అభిప్రాయంలో.
పంజరంలోని చిలుక ఆమె మనసు, ఒక వేళ దేనికైనా ప్రతీకగా ఉండాలి అనుకుంటే.
అలా బిగుసుకుని ఉన్న మనసు తోటలోకి వచ్చి వాలే చిలుకలని చూసి ఆనందించే స్థాయికి ఎదిగింది అనుకోవచ్చేమో.
ఏదో కావలనిపించి, ఏం కావాలో తెలియక ఉన్న మనసుకి, దిగులు వదులుకుని మనసుని free చేస్తే ఆనందం స్వేచ్ఛగా ఎగిరే చిలకల మల్లే వచ్చి వాలుతుందని నాకు తోచింది.
భాను, అవునండీ. మీరన్నది నిజమే. జానకీరాణి కథలాటివి కూడా వచ్చేయి. కానీ సామూహికంగా ఆనాడు వచ్చినకథలూ, ఆనాటి సామాజిక వాతావరణం చూస్తే, కామాక్షమ్మ, వాసంతిలాటివారే ఎక్కువ అనుకుంటున్నాను నేను. చారిత్ర్యకంగా మనకి అణకువ, వినయం, క్రమశిక్షణ – లాటివి మన సాంస్కృతిక విలువలు. వాటిని ఆడవారే కాదు మగవారు కూడా ఆచరణలో పెట్టేరు. స్త్రీలవిషయంలో ఇది ఎక్కువ అని నేను ఒప్పుకున్నా, వాటిని తమకి అనుకూలంగా మార్చుకున్న స్త్రీలు కూడా వున్నారు కదా.
మాలతి గారు
నేనుకుంటా ఆ రోజుల్లో సాధారనంగా స్త్రీ లందరూ చిన్నప్పటినించి ఇళ్ళల్లో ఒక రకమయిన క్రమశిక్షణ ఒక రకమయిన జీవితానికి అలవాటుపడి అంటే అప్పటి పరిస్తితుల ప్రకారం అన్నిటిని దిగమింగుకొని కుటుంబం లో అందరికి ఆమోద యోగ్యంగా ఒదిగిపోవటానికి ప్రయత్నిస్తూ ఉండేవారేమో. బహుశ కొందరు రచయిత్రులు ఆ నేపధ్యం నుంచి వచ్చి ఉండి అల్లాంటి భావాలతో రాయడం ఆ ప్రభావం వాళ్ళ రచనల్లో అల ఉండిందేమో. అనుకుంటానండి. మీరన్నట్లు ఆ రోజుల్లో సమస్య ఉందని గుర్హించడమే ఒక ప్రగతి శీలకంగా కనిపించిందేమో అన్నారు. నేను చదివిన దాని ప్రకారం 1955 లో నే జానకి రాణి వ్రాసిన ” నా జీవితం నాకిచ్చేయ్ అన్న కథ లో పాతికేళ్ళ భర్త హింసను బరిస్తూ మౌనంగా జీవించి చివరకు కూతురి ప్రోద్బలంతో విడాకులు తీసుకున్న స్త్రీ తానెంత విలువయిన జీవితాన్ని కోల్పోయిందో తలచుకొని ఆక్రోశించతాన్ని చిత్రీకరించిందట. అంటే నా ఉద్దేశం సమస్యను హింసను గుర్తించడమే కాదు దాన్నించి విడాకులు తీసుకొని సమస్య కు ఒక పరిష్కార మార్గం చూపించడం అంతకు ముందు రోజుల్లో కథల్లో ఉండటం మనం చూడవచ్చు. జీవితంలో హింసకు వేదనకు కన్నీళ్ళకు ఇంకా ఎన్నింటినో దిగమింగుకొని అదే ఒదుగుదలను ఆదర్శంగా తీసుకొని రచనలు చేశారేమో. అయినా కూడా వాళ్ళ ఎంత సంప్రదాయ బద్దంగా రాసినా వారి రచనల్లో దాంపత్య జీవనంలో సమస్యలు ఒంటరి వేదనలు ఇలా కనపడేవేమో. మీరేమంటారు
@ భాను, బాగా చెప్పేరండీ. అవును. కామాక్షమ్మ సుందరరావుని మార్చే ప్రయత్నం కానీ, తానీ ఆ పరిస్థితినుండి బయటపడే ప్రయత్నం కానీ చెయ్యలేదు. పగడాలులో వాసంతి కూడా అంతే. మొదట్లో చిన్నపిల్ల కనక అనుకున్నా, పెద్ద అయినతరవాత కూడా క్రియలో చేసిందేమీ కనిపించదు. నేను అనుకోడం – బహుశా ఆరోజుల్లో ఒక సమస్య ఉందని గుర్తించడమే ప్రగతిశీలకంగా కనిపించిందేమో. అంటే చారిత్ర్యకంగా చూస్తే అంతకు పూర్వం, సేవకోసమే పుట్టేం అనుకునేవారు. ఆతరవాత తాము కూడా మనుషులమే, తమని మనుషులుగా గుర్తించాలి అన్న తపన కలిగింది. ఆవిషయం ఆవిష్కరించడమే ఈకథలో రచయిత్రి ఉద్దేశ్యమేమో..
ఇంకా మిగతా పాఠకులకి ఏమనిపించిందేమో కూడా చూద్దాం.
మీ అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు.
మాలతి గారు
నిజమే కథలోనే చెప్పినట్టు కామాక్షమ్మ అతనికి భార్య అనే ఒక వస్తువు. కామాక్షి కి ఒకటే కోరిక నగల వ్యామోహం. పెళ్ళికి ముందు కూడా ఆమెకు పెళ్ళంటే నగలు రావటమే తప్ప అంతకుమించి పెద్ద ఆలోచనలు కుడా లేనట్లు కనపడుతుంది. మీరన్నట్లు ఈ కథలో కామక్షమ్మకు స్వేచ్చ లేకపోవడం భార్య భర్తల మధ్య ఉండాల్సిన అనురాగం ప్రేమ సామరస్యం ఏవి లేవు. అతని ప్రవర్తన తప్పు కావచ్చు కాని ఆవిడ వైపు నుంచి కూడా ఎటువంటి ప్రయత్నం కుడా కనపడలేదు. భర్త అలవాట్లను అతని ప్రవర్తను ను చూస్తూ ఉరుకుందే తప్ప అతన్ని ఆమె ప్రవర్తన మరియు చర్యల వల్ల మార్చే ప్రయత్నం ఎక్కడ కనపడలేదు. అతన్ని ప్రశ్నించినట్లు లేదా అతని ప్రవర్తను ఎదిరించడం కుడా ఎక్కడ కనపడలేదు. ఒంటరి వేదన ను అనుభావిన్చిందే తప్ప ఆ పరిస్తితులనుంచి బయట పడతందుకు ఆమె చేసిన ప్రయత్నమేమిటి. ఈ కథ లో కామాక్షమ్మ ఒంటరి తనానికి అలవాటుపడి అలాగే భర్త ప్రవర్తను కు అలవాటు పది జీవితం అల వెల్లదీస్తుందే తప్ప కొత్త దనం కోరుకోవడం దాన్ని పొందతందుకు అంటే ఒంటరితనం నుంచి బయటపడతందుకు ఆమె ఏమి ప్రయత్నం చేయకపోవటం, భర్త మారే మనిషి కాకపోవచ్చు కాని కనీసం అతన్ని మార్చేతందుకు తన వైపు తిప్పుకోతందుకు ఆమె ఎం చేసింది అంటే ఏమిలేదు . జీవితాన్ని అల వెళ్ళబుచ్చడం తప్ప. ఇక్కడ అప్రస్తుతమయినా శారదాదేవి గారి ఇంకో కథ “పగడాలు” కూడా నేను చదివాను. కథ బాగుంది. కాని అందులో కూడా వాసంతి చిన్నప్పుడు పెళ్లి అయి పోయేటప్పుడు కూడా తనకు నచ్చని విషయాన్ని దైర్యంగా చెప్పలేకపోతుంది. కనీసం పెళ్లి అయి కొన్ని రోజులకు ఒక బిడ్డకు తల్లి అయినాక తల్లి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆమె ఏమి చేయలేక అదే విదంగా ఆలోచించి భారంగా ఉంటుందే తప్ప కనీసం తల్లి ఏమిటి అని అడిగినప్పుడు కూడా అమ్మ నువ్వు అప్పుడు చేసింది తప్పు అనే దైర్యంగా చెప్పలేదు. తనకు తానూ బాధ పడటం తప్ప. ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఈ రెండు పాత్రల్లో కూడా తమకు తాము ఒంటరిగా వేదన ను అనుభవించడం తప్ప ఎదిరించడం కాని, ప్రశ్నిచండం కాని లేదా ఆ వేదన లోనుంచి బయటపడే ప్రయత్నం ఎక్కడ లేదు అని చెప్పడమే నా ఉద్దేశం.