భండారు అచ్చమాంబగారి జీవితకాలం 1874 నుండి 1905 వరకు. గురజాడ అప్పారావుగారికంటే ముందే అచ్చమాంబగారు 1898లో ఆధునిక తెలుగు కథకి శ్రీకారం చుట్టేరని ఒక వాదన. ఈవాదన మాట ఎలా ఉన్నా, ఈనాడు కనీసం ఆమెగురించి కొంతవరకైనా మనకి తెలిసే అవకాశం దొరికింది. తెలుగు కథాసాహిత్యంలో చారిత్ర్యకంగా ఈకథలకి ప్రత్యేకమయిన స్థానం ఉంది. ఆమె రచనలమీద సుమారు పదేళ్ళుగా చర్చలు జరుగుతున్నాయి.
సంగిసెట్టి శ్రీనివాస్ అచ్చమాంబగారిమీద విశేషమైన కృషి చేసి, ఆమె మొత్తం 12 కథలు రాసినట్టు కనిపిస్తోందనీ, తమకి దొరికినవి 10 అనీ చెప్తూ, వాటిని ఒక పుస్తకంగా ప్రచురించారు.
ఈ పుస్తకంలో అచ్చమాంబగారి జీవితం, ఆమెకథలూ విశ్లేషిస్తూ సంగిశెట్టి శ్రీనివాస్ (సంపాదకుడు), డా. ముదిగంటి సుజాతారెడ్డి రాసిన వ్యాసాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కొత్తపాళీ ధర్మమా అని ఈ పుస్తకం పిడియఫ్ రూపంలో నాకు దొరికింది. ఈకథలమీద మీ అభిప్రాయాలు తెలుసుకునే ఉద్దేశ్యంతో వీటిని మీముందు పెడుతున్నాను. పూర్వంలా ఒక కథ కాక మొత్తం 10 కథలూ ఒకే పిడియఫ్ రూపంలో ఉన్నాయి కనక అలాగే మీ దుంచుతున్నాను.
చదివి, మీ అభిప్రాయాలు రాయండి.
సంగిసెట్టి శ్రీనివాస్, ప్రచురణకర్తలు కవిలె, తెలంగాణా రిసెర్చ్ ఎండ్ రిఫరాల్ సెంటర్, హైదరాబాదు, వారికి ధన్యావాదాలతో, ఈ కథలు ఇక్కడ పెడుతున్నాను.
మరోమాట. అన్ని కథలూ చదవాలనే నిబంధన ఏమీ లేదు. మీకు తోచిన ఒకటో రెండో చదివి మీ అభిప్రాయాలు పంచుకున్నా సంతోషమే.
ఈ పుస్తకం కొనుక్కోడానికి అన్ని ప్రముఖ పుస్తకాలషాపులలో దొరుకుతుంది. లేదా, ప్రచురణ కర్తలని సంప్రదించవచ్చు.
వారి సమాచారం కింద ఇస్తున్నాను.
కవిలె – తెలంగాణా రిసెర్చ్ అండ్ రిఫరల్ సెంటర్,
13-6-434/బి/38 Himagiri Avenue, Flat No. 306,
Om nagar, Mehdipatnam, Ring Road
Hyderabad, 500 008.
Mobile: 98492 20321
వెల. 95 రూపాయలు.

అచ్చమాంబగారి కథలు – నిజమేనండీ, నేను కూడా వ్యాఖ్యలకోసం ఎదురు చూస్తున్నాను. ఇద్దరు నాకు విడిగా మెయిళ్లిచ్చారు చదవడానికేమంత ఆసక్తి కరంగా లేవని. గత పదేళ్లుగా అచ్చమాంబగారే తొలి తెలుగుకథకులు అన్న వాదన వచ్చినతరవాత నాకు ఆసక్తి కలిగింది. బహుశా ఇవి సాహిత్యచరిత్రలో భాగంగా చదవాలనుకుంటాను. ఈనాడు మనం చెప్పుకుంటున్న కథాలక్షణాలు ఆధారంగా చూస్తే, నాకు మూడు కథలు – ధనత్రయోదశి, స్త్రీవిద్య, అద్దమను-సత్యవతియును కథలుగా అనిపించేయి. ఇందులో అద్దమును-సత్యవతియును మీ పిల్లలబ్లాగులో కథగా కూడా బాగుంటుందనుకుంటాను.
మిగతావి మన జానపదవాఙ్మయం కోణంలోనుంచి పరిశీలించాలి. స్కెచ్ అని కూడా అనుకోవచ్చు. భాష – ఆనాటి భాష అదీ. గురజాడ, ఉన్నవలాటివారు వ్యావహారికంలో రాసేం అన్న కథలు కూడా ఈనాటి మన వ్యావహారికం కాదు కదా. మాలతి
ఇప్పటి వరకూ (మొదటి) మూడు కథలు చదివాను. మొదటి కథ చదివాక ఆసక్తి తగ్గింది. కానీ ఈ చర్చకి అసలు స్పందన లేదు నేను చదివి నా అభిప్రాయం చెప్దామని చదవడం మొదలు పెట్టాను.రెండో కథ నచ్చింది నాకు. ఇప్పాతికి పరిచయమైన కథాంశమే. కానీ చెప్పిన తీరు బావుందనిపించింది. ఆ భాష అలవాటు తక్కువైనా, అందులో ఏదో అందమ్ముంది. కామాలూ ఫుల్ స్టాపులూ లేకుండా చదవడం కష్టమవ్వాలి నిజానికి. కానీ ప్రవాహంలా సాగాయి వాక్యాలు. ఆ విధంగా మూడో కథ కూడా చదవడానికి బావుంది కానీ కథ ఏమంత లేదు. ఇది ఇప్పటికి నా అభిప్రాయం.